పునర్విభజనతో అన్ని జిల్లాల్లో టెన్షన్
హైదరాబాద్ పైనే అందరి దృష్టి
సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణా ఆవిర్భావ సమయంలో 10 జిల్లాలతో తెలంగాణా ఏర్పాటైనా పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం ఈ సంఖ్యను 33 జిల్లాలుగా పెంచింది. జిల్లాల పునర్విభజన సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా….. గత ప్రభుత్వం అదికారుల నివేదికల ఆధారంగా జిల్లాల విభజనను పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన, జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వవ్యవస్థీకరణపై మరోసారి దృష్టి సారించినట్లు శాసనసభలో రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఎన్నో మార్లు జిల్లాల పునర్విభజన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కేసిఆర్ లక్కీ నంబర్ ఆధారంగా జిల్లాల విభజన జరిగిందని, శాస్త్రీయతను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్న వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందన్న ప్రచారం దాదాపు రెండు వారాలుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి కూడా జిల్లాల పునర్విభజనలో కీలకం కానుంది. గ్రేటర్ పరిధిని భారీగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రేటర్ లో జిల్లాల విభజన ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాను ఏమాత్రం ముట్టుకోకుండా రాష్ట్ర వ్యప్తంగా జిల్లాల విభజనను పూర్తి చేసింది. ఇప్పుడు గ్రేటర్ పరిధి కూడా పెరగడంతో హైదరాబాద్ ను ఎన్ని జిల్లాలుగా మారుస్తారన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. జిల్లా పునర్విభజన చేస్తే సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది, సికింద్రాబాద్ జిల్లాతో పాటు సికింద్రా బాద్ పేరుతో కార్పోరేషన్ కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నాయి.

ఇక మిగిలిన జిల్లా విషయానికి ఉదాహరణకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే కోడంగల్ నియోజకవర్గం ఇప్పుడు మూడు జిల్లాల పరిధిలో ఉంది. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇలా ఒక్క నియోజకవర్గంలోని ఒక్కో మండలం ఒక్కో జిల్లాలో ఉండడంతో పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని జిల్లాలు నియోజకవర్గానికి ఎక్కువ డివిజన్ కేంద్రానికి తక్కవ అన్న చందంగా కూడా జిల్లా కేంద్రాలుగా ఆవిర్బవించాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలాంటి సమస్యలకు పులిస్టాప్ పెట్టే విధంగా జిల్లాల విభజన చేసేందుకు తాము రెడీ అవుతున్నామని అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. గత ప్రభుత్వంలో కొన్ని ములుగు లాంటి గ్రామ పంచాయతీ కూడా జిల్లా కేంద్రంగా ఒక్క సారిగా మారిపోయిన విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

33 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం 10 జిల్లాలను రద్దు చేయడంతో పాటు ఆయా ప్రాంతాలను సమీపంలో ఉండే జిల్లాలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోడంగల్ నియోజకవర్గాన్ని మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా నారాయణపేటను కూడా మహబూబ్ నగర్ లో విలీనం చేస్తూ మక్తల్ ప్రాంతాన్ని గద్వాల్ జిల్లాలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పునర్వ్యవస్థీకరణపై కసరత్తును సర్కార్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్కీ నంబర్ కు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సిరిసిల్లా, సిద్దిపేట లాంటి జిల్లాలను రద్దు చేస్తే బీఆర్ ఎస్ కీలక నేతల జిల్లాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరసనలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు సర్కార్ అంచనా వస్తోంది. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా నారాయణపేట, గద్వాల లాంటి ప్రాంతాల్లో కూడా జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. పునర్వ్యస్థీకరణలో ప్రజా ఆందోళనలతో ఆవిర్భవించిన జిల్లాలతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. ఈ ప్రబావం జోనల్ వ్యవస్థ పై పడకుండా పూర్తి చేస్తే ప్రభుత్వం సగం హర్డిల్స్ గట్టిక్కినట్లే అన్న వాదన వినిపిస్తోంది. జోనల్ వ్యవస్థలో మార్పులకు మళ్లీ ఆమోదం తెలపాలంటే మరో ఏడాది రెండేళ్ల పాటు విద్యా, ఉద్యోగ రంగాలపై తీవ్రంగా చూపే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.





Leave a Reply