NewsInn

News in a Click

తప్పుడు వార్త‌లు రాసిన‌ వారిపై చ‌ర్య‌లు తప్ప‌వు

తప్పుడు వార్త‌లు రాసిన‌ వారిపై చ‌ర్య‌లు తప్ప‌వు

డీజీపీ విచారణలో దోషులెవరో తేలుతుంది

IAS అధికారులను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం

మీడియా విలువలు దిగజారి పోతున్నాయి

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

మహిళా అధికారులను మానసికంగా వేధించే విధంగా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని, అన్ని మీడియా యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు ఉంటే సంబంధిత ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని, కానీ తప్పుడు వార్తలతో వ్యక్తిగత ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దని హితవు పలికారు.మహిళా IAS అధికారులను లక్ష్యంగా చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, ఆధారంలేని ప్రచారాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, IAS అధికారుల బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.IAS ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదని, అటువంటి ఉన్నత స్థాయి అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు.

రాజకీయ నాయకులు, IAS అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లోని మహిళా అధికారులు, ఇంచార్జ్ మంత్రులపై కూడా ఆధారంలేని కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై డీజీపీతో చర్చించామని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సంక్రాంతి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు విస్తృత ఏర్పాట్లు…

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ఊర్లకు వెళ్లి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నామని, గత ఏడాది 9 లక్షల వాహనాలు ప్రయాణించాయని గుర్తు చేశారు. టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే వెంటనే టోల్ గేట్లు తెరవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పంతంగి టోల్ గేట్ వద్ద తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని సూచించామని తెలిపారు. డీజీపీతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసినట్లు చెప్పారు.ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వెంటనే క్రేన్ల సహాయంతో క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సరిహద్దు వరకు ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత తమ బాధ్యతగా చేపట్టామని స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో టెండర్లను ఆహ్వానిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *