రాజకీయ లబ్ది కోసం విమర్శలు తగవు : మంత్రి శ్రీధర్ బాబు

(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రజాస్వామ్యంలో ‘విమర్శ’ అనేది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఇది అవసరమని మంత్రి శ్రీధర్ బాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రజా ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలు లేవన్నారు. పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత కూడా. కానీ, ఆ విమర్శ అనేది ‘వాస్తవాల’ పునాదుల మీద నిలబడాలి తప్ప.. కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన ‘అసత్యాల’ మీద కాదన్నారు. మా ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక, కేవలం తమ స్వార్థం రాజకీయాల కోసం, ఉనికి కోసం కొందరు కుట్రపూరితమైన అసత్య ప్రచారాలకు తెరలేపారన్నారు.ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పెట్టుబడులు రావడం లేదంటూ… ఇలా రకరకాలుగా అసత్యాలను వండి వార్చుతున్నారని విమర్శించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రగతి నివేదిక గణాంకాలతో ఉందన్నారు. ఐటీ, ఇన్నోవేషన్, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాల్లో తెలంగాణ ముద్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోందన్నారు. కేవలం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణ ఎదిగిందని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చిందన్నారు. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక పారదర్శకతను తీసుకువచ్చామని చెప్పారు.


Leave a Reply