తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు మొదలు పెడుతాం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
అసెంబ్లీ వేదికగా జిల్లాల ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయంగా వ్యవహరించలేదని, ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ….శాస్త్రీయంగా చేసేందుకు తాము చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో జిల్లాల పునర్విభజనపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. 33 జిల్లాలు అవసరం లేదు…ఏపీలో మాదిరిగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఒక్కో జిల్లా ఉంటే సరిపోతుందన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో…. ఈ ప్రచారం క్షేత్ర స్థాయిలో కూడా జోరుగా మొదలైంది. బీఆర్ ఎస్ పార్టీ జిల్లాల పునర్విభజనను తమ మున్సిపల్ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటామని ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల రద్దు ఉత్త ప్రచారమే అని తేల్చేశారు. కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు.“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తామని చెప్పారు.
గోదావరి బెల్ట్ ను పర్యాటక ప్రాంతంగా మారుస్తాం…
2027లో నిర్వహించబోయే పుష్కరాల గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతాం. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గతేడాది సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించుకున్నాం. అలాగే, వెయ్యేండ్లు గుర్తుండే విధంగా మేడారంను తీర్చిదిద్దుకుని సమ్మక్క – సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించాం. మేడారం జాతరకు 2 కోట్ల మంది దర్శించుకున్నారు” అని ముఖ్యమంత్రి అన్నారు. ‘సమ్మక్క – సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు 205 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.




Leave a Reply