(మెదక్,న్యూస్ఇన్)
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటన రాజకీయంగా హాట్ హాట్ మారింది. రాజకీయ పార్టీల తీరుపై ఆయన విడుదల చేసిన ప్రకటన అందరినీ అయోమయంలో వేస్తోంది. సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన తాను ఉంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా తప్ప బడుతుండడం విశేషం. రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకే దారిన వెళుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా పార్టీలు అన్నీ ఒకే లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఒకే దారిలో నడుస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై పోరాడితే తప్పు కాదని, అయితే అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరిస్తున్న తీరును కూడా ఒక సారి ఆయా రాజకీయ పార్టీలు సమీక్షించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఇష్టాను సారంగా హామీలు ఇవ్వడం….అధికారం దక్కించుకున్న తరువాత ఆ హామీలను విస్మరించడం రాజకీయంగా సరైంది కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీకి, ప్రభుత్వానికి ఇది మినహాయింపు కాదన్నారు. అన్ని పార్టీలు అదే తీరును అనుసరిస్తున్నాయని ఇది ఎంత వరకు సమంజమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జగ్గారెడ్డి ఇలాంటి ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ హాట్ గా మారింది. గత కొన్ని రోజుల క్రితం తన ఫేస్ బుక్ పేజీలో ఒక ఫోటో షేర్ చేస్తూ (సహనం @ జూన్ 30) అనే క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా ఈ ప్రకటన విడుదల చేయడం పై రాజకీయంగా జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ మొదలైంది. ఇటీవలే కొద్ది రోజులక్రితం మరోసీనియర్ నేత రాష్ట్ర 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ…10 ఏళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ని వీడారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేగుతున్నాయి. ఆ సీనియర్ నేత బాటలోనే మరికొంత మంది నేతలు ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.ఈ పరిస్థితుల్లో జగ్గారెడ్డి ప్రకటన అధికార పార్టీ నేతల్లో కూడా ఆయోమయానికి గురి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరై జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షులు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానిపై కూడా తీవ్ర వివాదం రేగింది. తాజాగా ఆయన విడుదల చేసిన ప్రకటన మరోసారి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతగా రాజకీయంగా ఇతర పార్టీలను విమర్శించడం సహజమే….కానీ జగ్గారెడ్డి మాత్రం రాజకీయాల్లో అన్ని పార్టీలు అంతే అని ప్రకటించడం ఇందుకు కాంగ్రెస్ మినహాయింపు కాదని పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.పార్టీలో పరిణామాలపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారా…. ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.






Leave a Reply