(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది -2026లో ఎండలు , వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ 15 వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని , ఐఎండి హెచ్చరికల నేపధ్యంలో తీసుకోవలసిన చర్యలపై 20 సంబంధిత శాఖలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ 45 రోజుల్లో రాష్ట్రంలో గ్రామీణ పట్టణప్రాంతాల్లో త్రాగునీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మోటార్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేసి 15వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్నిశాఖలు ముఖ్యంగా పంచాయితీ రాజ్, మున్సిపల్ ,ఫైర్, హెల్త్ సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.
నల్గొండ మంచిర్యాల సూర్యాపేట పెద్దపిల్లి జగిత్యాల ఖమ్మం వరంగల్ కరీంనగర్ మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదాలకు గురౌతున్నారని అందువల్ల ఆయా ప్రాంతాలలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, పోలీస్ , రెవెన్యూ విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాలలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం కల్పించాలని స్ధానిక సంస్దలు, మున్సిపాల్టీలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.







Leave a Reply