NewsInn

News in a Click

పోలీసు శాఖ‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తా- సీవీ ఆనంద్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా నూత‌న డీజీపీ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకున్న సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖ‌ను పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. నేర‌స్తుల తీరు మారింద‌ని, సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తున్న నేర‌స్తుల సంఖ్య పెరిగింద‌న్నారు. పోలీసు శాఖ‌లో కూడా సాంకేతిక‌త‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా తీర్చి దిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ‌తంలో ఉన్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పోలీసు శాఖ నిర్ణ‌యాల‌ను తీసుకుందని, ప్ర‌స్తుతం గ్రే హౌండ్స్, ఎస్ ఐ బీ లాంటి వ్య‌వ‌స్థ‌ల‌తో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌న్నారు. న‌క్స‌లిజం దాదాపు అంత‌మైంద‌ని, భ‌విష్య‌త్తులో కూడా అంత సులువుగా పెరిగే అవ‌కాశం లేద‌న్నారు. దేశంలో తెలంగాణా పోలీసుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని అయినా శాఖా ప‌రంగా మ‌రింత మెరుగులు దిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళ‌లు, చిన్నారుల ట్రాఫికింగ్ చేసే గ్యాంగ్ ల‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సైబ‌ర్ క్రైమ్స్, డ్ర‌గ్స్ వినియోగంపై మ‌రింత సీరియ‌స్ గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీవీ అనంద్ అన్నారు. రాష్ట్రంలో రాజ‌కీయ నేత‌ల‌పై న‌మోదు చేస్తున్న కేసుల విష‌యంలో స్పందించేందుకు ఆనంద్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు.స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తే ఎవ‌రు ఫిర్యాదు చేసినా కేసులు న‌మోదు చేస్తామ‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విష‌యంలో త‌న‌కు తాజా ప‌రిస్థితి తెలియ‌ద‌ని, త్వ‌ర‌లో ఆ కేసు పై స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌న్నారు. దాదాపు విచార‌ణ పూర్త‌య్యే ద‌శ‌లో ఆ కేసు ఉంద‌ని మాత్రం కొత్త డీజీపీ వ్యాఖ్య‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *