(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరం రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఐటీ ఉద్యోగాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, లైఫ్ స్టేల్ మారుతోంది. రాత్రి వేళలో నగరంలో రాత్రి సంస్కృతి లో మార్పు లు వస్తున్నాయి. అదే సమయంలో మహిళల భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు ఒంటరిగా బయటికి రావడానికే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మల్కాజిగిరి సీపీగా ఇటీవల బాధ్యతుల చేపట్టిన సుమతి ఆ కమిషనరేట్ పరిధిలో కీలక ఆపరేషన్ నిర్వహించింది. సుమతి చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.“మహిళల భద్రతపై మాటలు కాదు.. చర్యలు కావాలి” అనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చేలా ఈ ఆపరేషన్ సాగింది. సాధారణ మహిళలా రోడ్డుపై నిలబడి, అసలు పరిస్థితి ఏంటో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న ఐపీఎస్ అధికారి సుమతి చూపిన ధైర్యం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రత్యేక ఆపరేషన్…..
దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్ ప్రాంతాల్లో మహిళలపై వేధింపుల ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో యువతులు, ఉద్యోగినులు, కాలేజీ విద్యార్థినులు బస్సు స్టాప్లు, మెట్రో స్టేషన్లు, రోడ్ల వద్ద అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా…. పోకిరీలు పట్టుబడకుండా తప్పించుకుంటున్నారనే అభిప్రాయం పోలీసుల్లో ఏర్పడింది. దీంతో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీపీ సుమతి నిర్ణయం తీసుకున్నారు.అర్ధరాత్రి 12 గంటల సమయంలో సాధారణ మహిళలా దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఆమె నిలబడ్డారు. సాధారణ దుస్తులు ధరించి, ఎలాంటి పోలీస్ భద్రత కనిపించకుండా ఎంతో సహజంగా రోడ్డుపై నిలిచారు. అయితే కొద్ది దూరంలో సివిల్ డ్రెస్సుల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు గమనిస్తూ సిద్ధంగా ఉన్నాయి.
అసలు రూపం బయటపడింది….
సీపీ సుమతి అక్కడ నిలబడి కొద్దిసేపే అయ్యింది. రాత్రివేళ రోడ్లపై తిరిగే కొందరు యువకులు ఆమె వద్దకు రావడం మొదలుపెట్టారు. మొదట చిరునవ్వులు, తర్వాత అసభ్య వ్యాఖ్యలు, ఆపై నేరుగా వేధింపులు మొదలయ్యాయి.“ఎక్కడికి?”, “వస్తావా?”, “రేటెంత?” అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడినట్లు సమాచారం. కొందరు బైక్లపై చుట్టూ తిరుగుతూ వేధించగా, మరికొందరు ఫోన్ నంబర్ అడిగుతూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. మల్కాజిగిరి సీపీ అని ఏ ఒక్కరు కూడా గుర్తించకపోవడంతో సుమతి ఆపరేషన్ విజయవంతం అయింది.

అక్కడే అసలు ఆపరేషన్….
సీపీ సుమతి సిగ్నల్ ఇవ్వగానే చుట్టుపక్కల సిద్ధంగా ఉన్న పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చిన పోకిరీలకు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్కు గురయ్యారు. కొందరు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు.ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 40 మందికి పైగా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో వారిలో చాలా మంది కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులు, కొందరు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్లు బయటపడింది.పోలీసులను మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, పట్టుబడిన వారిలో చాలామంది చదువుకున్నవారే కావడం. “మజాక్ చేశాం”, “ఫ్రెండ్స్తో సరదాగా తిరిగాం”, “ఇంత పెద్ద విషయం అవుతుందని అనుకోలేదు” అంటూ వారు చెప్పిన సమాధానాలు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
సీపీ సుమతి కి ప్రశంసలు
ఈ ఆపరేషన్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో సీపీ సుమతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది మహిళలు “ఇలాంటి అధికారులు ఉంటేనే మహిళా భద్రతపై నమ్మకం పెరుగుతుంది” అంటూ స్పందిస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తారు కానీ, స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి రిస్క్ తీసుకోవడం అరుదుగా జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

భద్రతపై మళ్లీ చర్చ…..
హైదరాబాద్లో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రాత్రివేళల్లో మహిళలు బయటకు రావడమే కొందరికి అవకాశంగా మారుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.నగరంలో షీ టీమ్స్, సీసీ కెమెరాలు, పటిష్ట పహారా ఉన్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈవ్టీజింగ్ పూర్తిగా తగ్గలేదని మహిళా సంఘాలు చెబుతున్నాయి.ప్రత్యేకంగా మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్లు, ఫుడ్ స్ట్రీట్లు, హాస్టల్ ప్రాంతాల్లో యువతులు వేధింపులకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. చాలామంది భయంతో ఫిర్యాదు చేయకపోవడం వల్ల అసలు సంఖ్య బయటకు రావడం లేదని అంటున్నారు.
మరిన్ని ఆపరేషన్లు…?
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో, ఇలాంటి డ్రైవ్లను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా మహిళలపై వేధింపులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.సివిల్ డ్రెస్సుల్లో మహిళా పోలీసులు, అండర్కవర్ ఆపరేషన్లు, రాత్రి పహారా బృందాలను పెంచే దిశగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. “ఖాకీ సింగం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











Leave a Reply