(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. దేశంలోని మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనంలోకి తీసుకుని శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మల్కాజిగిరి పరిధిలోని గాజుల రామారంలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ పనులను వచ్చే మూడు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. .హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.
మెట్రో విస్తరణ…..

రాయదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మెట్రోను విస్తరణ పనులు చేపడుతామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకుంటే సరిపోదని, అందుకు అనుగుణంగా ప్రణాళికలతో అభివృద్ధి జరగాలని చెప్పారు. సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొషన్ భవనాలను ఆధునిక సదుపాయాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లో పేదలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారని గుర్తుచేస్తూ నగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను కట్టించి కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్న వారికి అదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని, అందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని తెలిపారు.
స్పష్టమైన విజన్…..

దేశంలోని ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, బెంగుళూరు, చెన్నై మహానగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయని వివరించారు. ఈ అయిదు నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఏమవసరమో గుర్తించి స్పష్టమైన విజన్తో పనిచేస్తున్నామని చెప్పారు. “ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభా ఉండగా, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ మహానగరంలో ప్రతి ఏటా 3 శాతం శరవేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం ఈ ప్రాంతమంతా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్.. ఇలా 4 రకాల పరిపాలన సాగింది. శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా తాగునీరు, రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త పేరుకుపోవడం, కరెంట్, పోలీసు వంటి అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే నిపుణులతో సమాలోచనలు చేసి 2100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విడదీయాలని నిర్ణయించాం.












Leave a Reply