NewsInn

News in a Click

నగరంలో టీడీపీ ఎంపీ భూకబ్జా – ఆరోపణలు

నగరంలో టీడీపీ ఎంపీ భూకబ్జా – ఆరోపణలు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై భూకబ్జా ఆరోపణలు ఆయన సోదరుడి ఫిర్యాదుతో వివాదాస్పదంగా మారుతున్నాయి.ఎంపీ కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్న M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థ చేపడుతున్నట్లు పేర్కొంటున్న భారీ భూ ఆక్రమణ, ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాన్ని అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు మాజీ ఎంపీ కేశినేని నాని తెలిపారు.

కూకట్‌పల్లి మండలం, ప్రగతి నగర్ సమీపంలోని శంషీగూడ గ్రామ పరిధిలోని (సర్వే నం. 57) TGIIC IT పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విధించిన యాక్టివ్ ఫ్రీజ్ ఆదేశాలు, NCLT ఇన్‌సాల్వెన్సీ పరిమితులను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురాకుండా, ప్రైవేట్ రాజీ పిటిషన్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం, సదరు భూమి పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమి అని, దానిపై ఎలాంటి ప్రైవేట్ హక్కులు లేవని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, నాగమ్మ టెంపుల్ సమీపంలో భారీ యంత్రాలతో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయని కేశినేని నాని ఆరోపించారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ద్వారా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వ తరఫున ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసి ప్రైవేట్ రాజీ పిటిషన్లను అడ్డుకోవాలని, అలాగే HYDRA అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా, ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై సైబరాబాద్ పోలీసుల ద్వారా క్రిమినల్ ట్రెస్ పాస్, చీటింగ్ తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని కూడా వినతిపత్రంలో విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *