(న్యూస్ఇన్, హైదరాబాద్)
గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ సైబరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kushను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.16.40 లక్షలు. ఈ సందర్భంగా 16 మంది డ్రగ్ వినియోగదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆగస్టు 11న వట్టినాగులపల్లి కింగ్డమ్ పబ్ రోడ్ వద్ద గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్ పెడ్లర్ కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్ను 16 మంది వినియోగదారులతో కలిసి అరెస్ట్ చేశారు. విచారణలో యశ్వంత్కు MDMAను కేరళకు చెందిన మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.

దీంతో ప్రత్యేక పోలీసు బృందాలను కేరళ, బెంగళూరుకు పంపి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆగస్టు 18న కేరళలోని త్రిస్సూర్లో మహ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్ను అరెస్ట్ చేశారు. విచారణలో యశ్వంత్కు 44.41 గ్రాముల MDMA సరఫరా చేసినట్లు, ఆ డ్రగ్ను ‘సామ్’ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి పొందినట్లు వెల్లడించాడు.
అదే రోజు బెంగళూరులోని బేగూర్లో నవీనా కేడీని అరెస్ట్ చేసి, ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా 51 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush లభించాయి. ఈ డ్రగ్ను కేరళకు చెందిన తన స్నేహితుడు అనేశ్వర్ నుంచి పొందినట్లు నవీనా విచారణలో వెల్లడించింది.మొత్తంగా 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, డ్రగ్స్ విలువ సుమారు రూ.16.40 లక్షలు ఉంటుందని డీసీపీలు తెలిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలిపారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.డ్రగ్స్ లేదా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే డయల్-100 లేదా సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నంబర్ 8712663061కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.










Leave a Reply