(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణ — ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో రద్దీని తగ్గించడానికి అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న అధికారులు హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే 1967 కు సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు హెల్ప్ లైన్ కు సమాచారం ఇస్తే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.
రద్దీకి మూడు కారణాలు ….
మొదటిది…. పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. 150 కు పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు, లీటరు రూ. 95 కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు.
రెండవది….. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉన్నాయి. దీనివల్ల పక్క రాష్ట్రాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్ లాంటి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారు.
మూడవది…..ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే పుకార్ల వల్ల సాధారణ ప్రజలు భయపడి, అవసరానికి మించి కొంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న నిల్వలు వేగంగా అయిపోతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS), పెట్రోల్, డీజిల్ కంపెనీలకు మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేసేందుకు డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను రంగంలోకి అందుబాటులోకి తెచ్చారు.
పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోకముందే వాటికి స్టాక్ చేరేలా అధికారుల పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపిణీ కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది 95% పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలో లీటర్లకు చేరుకుంది.

రాజధాని ప్రాంతంలో ఎలాంటి కొరత రాకుండా చూడటానికి, హైదరాబాద్లో 43% మేర పెంచారు. నగరంలో డీజిల్ నిల్వలను 46% (3,393 నుంచి 4,957 కిలో లీటర్లకు), పెట్రోల్ నిల్వలను 40% (3,908 నుంచి 5,466 కిలో లీటర్లకు) పెంచారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎప్పటిలాగే తమకు అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు.











Leave a Reply