NewsInn

News in a Click

దేశం నలుమూలల నుంచి మేడారంకు భక్తులు

దేశం నలుమూలల నుంచి మేడారంకు భక్తులు

కిక్కిరిసిన స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ గద్దెలు

(మేడారం,న్యూస్ఇన్‌)

ములుగు జిల్లాలోని మేడారం భక్తజన సంద్రంగా మారింది.లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు,భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. రాబోయే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివ‌స్తార‌ని అంచ‌నా . మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు,దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలోముంచెత్తుతోంది. విదేశాల నుంచి కూడా మానవ శాస్త్ర పరిశోధకులు ఈ అరుదైన గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయడానికివిచ్చేస్తున్నారు.

బంగారం న‌మ్మ‌కం…..

సారలమ్మ అమ్మవారు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని గత నెల రోజుల నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. అడవి తల్లుల ఆశీస్సుల కోసం..లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి పులకించిపోతోంది. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటిచెప్పే ఈజాతర, కేవలం ఒక పండుగ మాత్రమేకాదు.. అది కోట్లాది మంది నమ్మకం. మేడారంలో ఎక్కడ చూసినా బెల్లం (బంగారం)..కుప్పలే కనిపిస్తున్నాయి. భక్తులు తమ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా తల్లులకు’బంగారం’ సమర్పించుకుంటున్నారు.

పుష్కారాలను తలపిస్తున్న జంపన్న వాగు…..

గిరిజన ఆచారం ప్రకారం వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నజంపన్న వాగు ఇప్పుడు భక్తుల స్నానాలతో జన సముద్రాన్ని తలపిస్తోంది. వాగులోస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనిభక్తుల ప్రగాఢ విశ్వాసం. జంపన్న వాగు పుష్కరశోభను తలపిస్తున్నది.

ర‌ద్దీ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ఆధునిక ప‌ద్ధ‌తులు….

కాగా గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా అత్యాధునిక సెన్సార్ల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. 50కి పైగా మొబైల్ మెడికల్ యూనిట్లు, ఎమర్జెన్సీ కోసంఎయిర్ అంబులెన్స్ సౌకర్యం సిద్ధంగా ఉన్నాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా ‘మేడారం యాప్’ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా పార్కింగ్ ప్లేసులు, ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.

విద్యుత్ వెలుగులు….

భక్తుల రద్దీతో విద్యుత‌ వెలుగులతో , రాత్రి వేళ అద్భుతమైన దృశ్యంతో మేడారం మెరిసిపోతున్నది. చిన్న చిన్న వాగుల ఒడ్డున, చెట్లకింద వేలాది మంది భక్తులు వంటలు చేసుకుంటూ, చిన్న చిన్న దీపాల వెలుగులో ఆనందంతో కుటుంబ సభ్యులతో సేద తీరుతూ ఈ పర్యటనను మధిలో నిలుపుకుంటున్నారు.బందు మిత్రులతో కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయడం ఇక్కడి ప్రత్యేకత. చాలామంది భక్తులు తమ ఇళ్ల నుంచే బియ్యం,పప్పు తెచ్చుకుని, మేడారం చెట్ల కింద ‘వనభోజనాలు’ చేస్తారు. ఇది ఒక గొప్ప పర్యాటక అనుభవాన్ని కూడా ఇస్తుంది.

మేడారం మ‌హాజాత‌ర అంటే మొక్కులు తీర్చుకోవడం మాత్రమే కాదు, అది తెలంగాణ గిరిజన అస్తిత్వానికి, ధైర్యానికి ప్రతీక. ఆధునిక ప్రపంచంలో మనిషికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *