NewsInn

News in a Click

‘వడదెబ్బ’కు వెంట‌నే చికిత్స అందాలి

‘వడదెబ్బ’కు వెంట‌నే చికిత్స అందాలి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. ఎండా కాలం నేపథ్యంలో వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకుంటున్న చర్యలను, హాస్పిటళ్లలో అవుట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అవసరమైన మెడిసిన్, ఓఆర్‌‌ఎస్ వంటివి అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవుట్ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్‌ సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్‌లో, ప్రతి ఫ్లోర్‌‌లో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్ ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నదని, ఈ నేపథ్యంలో అవుట్‌ పేషెంట్లకు, ఇన్‌పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు.

అవగాహన పెంచాలి……..

వడ దెబ్బ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్‌, బస్ స్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని అవేర్‌‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన కంటెంట్‌ను రూపొందించి, ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామి కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. పట్టణాల్లో ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, ఇతర గిగ్ వర్కర్లకు వడ దెబ్బపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *