(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు వత్తిడి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆశ్రయించడంతో ప్రత్యామ్నాయ చర్యలపై సర్కార్ దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్న సమయంలో చేసిన ఆరోపణలకు అనుగణంగా సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నా…కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంకా రంగంలో దిగడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మరోసారి అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు.హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు.కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ తో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక ను నిర్దేశించారు.










Leave a Reply