(హైదరాబాద్, న్యూస్ఇన్)
పాలమ్మిన….పూలమ్మిన డైలాగ్ తో రాజకీయాల్లో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డికి గడ్డు కాలం మొదలైంది. బలమైన ఆర్ధిక పునాదులపై రాజకీయం చేస్తే అన్నీ పార్టీల్లో ఆదరణ ఉంటుందన్న మల్లారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణా భవన్లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రిని కేసీఆర్ అసలు పట్టించుకోలేదు. భవన్ లో జరిగిన సమావేశ మందిరంలోకి కేసీఆర్ వస్తున్న సమయంలో మల్లారెడ్డి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసినా….కేసీఆర్ చూసి చడనట్లు వెళ్లిపోయారు. దీంతో సర్దుకున్న మల్లన్న సమయం కోసం వేచి చూసి మరోసారి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు వెళ్లారు. అయినా కేసీఆర్ ఆయన వైపే చూడకుండ వెళ్లి పోయారు.

అనంతరం పార్టీ ప్రతినిధుల సమావేశంలో పలువురు నేతలు వ్యవహరిస్తున్న విధానాలపై సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు ఇదే అదనుగా క్లాస్ పీకారు. ఇక్కడ ఉంటా…అక్కడ ఉంటా అంటే కుదరదని స్పష్టం చేశారు. ఉంటే పార్టీలో ఉండవచ్చు …లేదంటే వెళ్లిపోవచ్చన్న స్పష్టమైన ప్రకటన చేశారు. ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. ఆ తరువాత మూడు రోజులకు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన భేటీ కావడంతో మీడియాలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ పై పోరాడుతున్న పార్దీలో ఉంటూ….బీజేపీ అగ్రనేతలను కలుసుకోవడంపై పార్టీ అధినేత కేసీఆర్ సీరియస్ అయనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీతో కూడా టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరిగింది.

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ…పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో భాగంగా చేపట్టాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో టచ్ లో ఉంటూ…. ప్రస్తుతం ఉన్న పార్టీకి నష్టం చేకూరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ మారే అభిప్రాయం ఉంటే వెళ్లి పోవచ్చని కేసీఆర్ నోటి నుంచి మాట రావడంతో మల్లారెడ్డి షాక్ కు గురయ్యారు. తనకు తాను సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకునే మల్లన్న సోషల్ మీడియాలో కాదు ప్రజల్లో ఉండాలన్న సూచన కూడా కేసీఆర్ చేయడంతో ఒక్క సారిగా మల్లారెడ్డి ఆహభావాలు మారి పోయాయి.

పార్టీలో తనకు తిరుగులేదని, ఇతర పార్టీల కీలక నేతలను కలిసినా పార్టీ అధినేత ఇప్పటి వరకు మందలించకపోవడంతో ఇక తాను ఏలా వ్యవహరించినా…. గులాబీ పార్టీ అధినేత చూసి చూడనట్లే ఉంటారని మల్లారెడ్డి ఇప్పటి వరకు ధీమాగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజెపీ,కాంగ్రెస్ నేతలను కలిసినా అప్పట్లో పార్టీ అధినేత పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అదనుగా తాను ఏం చేసినా పార్టీ పట్టించుకోదన్న ధీమాతో మల్లారెడ్డి సహా మరికొంత మంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కు కేసీఆర్ తాజా హెచ్చరికలతో చెక్ పెట్టారు.
కేసీఆర్ వార్నింగ్ తో తాను తన విద్యా వ్యాపార సంస్థల్లో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకే ప్రధాని మోడీని కలిసినట్లు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. అయినా పార్టీ అధినేత మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందలేదని అంటున్నారు.










Leave a Reply