(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించడం, రాష్ట్రంలో దేశంలో ఏమూలన ఏం జరిగినా క్షణాల్లో అప్రమత్తం కావడం, రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం…. ఇవన్నీ ఆ శాఖ కనుసన్నల్లో నిత్యం జరిగే కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే ఎన్నో కేసుల వివరాలు సేకరించడం, క్రమశిక్షణతో మెలుగుతూ
చీటర్లను, రౌడీ షీటర్లను కటకటాల్లోకి పంపేందుకు అక్కడి నుంచే ఆదేశాలు వస్తుంటాయి. ఇలాంటి కేంద్ర కార్యాలయంలోనే ఫోర్జరీ (నకిలీ) ఫిర్యాదు భాగోతం వెలుగు చూడడం సంచలనం రేపుతోంది. దాదాపు మూడు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా….15 రోజుల క్రితం ఫోర్జరీ పత్రాల సృష్టి లో అసలు ట్విస్ట్ వెలుగు చూసింది.
పోలీసు శాఖలో కీలక స్థానంలో ఉన్న ఓ ఉద్యోగిపై కొన్ని రోజుల క్రితం ఒక ఫిర్యాదును షేక్ అజీముద్దీన్ వ్యక్తి చేశారు. పోలీసు శాఖలో ఆయన కు ఉన్న అనుభవం, పలుకుబడితో ఇంటెలీజెన్స్ విభాగంలో నియామకం అయి పోలీసు శాఖ అధిపతిగా ఎవరు డీజీపీగా ఉన్నా ఆ ఉద్యోగి చక్రం తిప్పుతారన్న పేరుంది. ఇలాంటి కీలక స్థానంలో ఉన్న తనపై ఫిర్యాదు అందిందన్న సమాచారంతో ఆ ఫిర్యాదును తప్పుదోవ పట్టించేందుకు వ్యూహాత్మకంగా ఆ ఉద్యోగి చక్రం తిప్పారు. తనకు పోలీసు శాఖలో వ్యతిరేకంగా ఉన్న మరో అధికారిపై ఆ ఫిర్యాదు వచ్చిందన్న నకిలీ సంతకంతో పత్రాలను సృష్టించారు. తనపై వచ్చిన ఫిర్యాదు మాదిరిగానే మరో ఫిర్యాదు తయారు చేసి ఉన్నతాధికారులకు ఆ ఫిర్యాదును చేరేలా చక్రం తిప్పారు.
ఉన్నతాధికారులు కూడా కీలక అధికారి సృష్టించిన నకిలీ (ఫోర్జరీ) ఫిర్యాదు ఆధారంగా మరో ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. క్రమ శిక్షణకు మారు పేరు కావడం, డీజీపీ కార్యాలయంలో పనిచేస్తూ ఆరోపణల నకిలీ ఫిర్యాదును నిజమని భావించిన డీజీపీ కార్యాలయం కూడా సీరియస్ గా స్పందించింది. ఇప్పటి వరకు ఫోర్జరీ ఫిర్యాదు సృష్టించిన అధికారి తీరుపై ఎవరికీ అనుమానం రాలేదు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు దారులను పిలిచి విచారణ మొదలు పెట్టడంతో అసలు భాగోతం బయటపడింది. ఈ వ్యవహారం డీజీపీ కార్యాలయంలో హాట్ హాట్ గా మారింది.
ఫిర్యాదు దారులు తెలిపిన ప్రకారం వివరాలు……
గోల్కండ ప్రాంతానికి చెందిన షేక్ అజీముద్దీన్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఫాక్ట్ న్యూస్ పేరుతో ఓ మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు. అజీముద్దీన్ పోలీసు శాఖలో చక్రం తిప్పుతున్నారన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జనవరి నెలలో డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అజీముద్దీన్ పిర్యాదు చేసిన ఆ కీలక అధికారి తనపై వచ్చిన ఫిర్యాదును మరో అధికారిపై వచ్చిన ఫిర్యాదుగా సృష్టించారు. ఇందుకోసం ఆజీముద్దీన్ చేసిన సంతకాన్ని ఫోర్టరీ చేసి ఆ ఫిర్యాదును తప్పుదోవ పట్టించారు. ఫోర్జరీ ఫిర్యాదు ఆధారంగా సూపరింటెండ్ స్థాయి అధికారిపై పోలీసు శాఖ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. తరువాత ఫిర్యాదు దారడైన షేక్ అజీముద్దీన్ కు మీ ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి రావాలని కోరారు. దీంతో ఫిర్యాదుదారుడు షాక్ కు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల ముందు అసలు విషయం తెలుపడంతో ఫోర్జరీ భాగోతం బయటకు వచ్చింది.

తాను చేసిన ఫిర్యాదు ఆ అధికారిపై కాదని షేక్ అజీముద్దీన్ విచారణ సందర్భంగా అసలు విషయం బయట పెట్టడంతో విచారణధికారి షాక్ తిన్నారు. తాను ఫిర్యాదు చేసింది ఒకరైతే…. చర్యలు తీసుకుంది మరొకరిపై అని విచారణాధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంత పకడ్భంధీగా ఫోర్జరీ చేసి ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగి సస్పెన్షన్ కావడం డీజీపీ కార్యాలయంలో కల కలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న డీజీపీ కార్యాలయం అసలు ఫోర్జరీ సూత్ర ధారి ఎవరన్న దానిపై ఆరా తీసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరు డీజీపీగా వచ్చిన తన పదవిని కాపాడుకుంటూ వస్తున్న ఆ అధికారిపైనే ఫిర్యాదు దారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గతంలో మంత్రుల దగ్గర కూడా పనిచేసిన అనుభవం ఉండడంతో రాజకీయంగా ఆయనకు పట్టు ఉందనే ప్రచారం పోలీసు శాఖలో ఉంది. అత్యున్నత పదవుల్లో ఉంటున్న వారికి దగ్గరగా విధులు నిర్వహిస్తుడడంతో ఆ అధికారి దగ్గరకు వెళ్లాలంటేనే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే అన్న ప్రచారం ఉంది. ప్రభుత్వాలు మారినా, డీజీపీలు మారుతున్నా ఆ శాఖలో ఉన్న తన పరపతితో అక్కడే తిష్ట వేయడం పై ఎన్నో అనుమానాలు ఫిర్యాదు దారులు వ్యక్తం చేస్తున్నారు.


డీజీపీ కార్యాలయంలో ఫోర్జరీ జరిగిందన్న వ్యవహారం బయటకు పొక్కడంతో మరింత రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. పోలీసు శాఖ కేంద్ర కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ఫిర్యాదును సృష్టించిన ఆ అధికారిని ఉన్నతాధికారులు…. కాపాడుతారా…లేదంటే ఫిర్యాదు దారులను ఆ అధికారి తన దారికి తెచ్చుకునేలా వత్తిడి తెస్తారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. మొత్తం మీద డీజీపీ కార్యాలయంలో జరిగిన వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలోనే హాట్ హాట్ గా మారింది. సాధారణంగా ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ జరిగితే ఫోర్జరీ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఈ విషయం పోలీసు శాఖలోనే చోటు చేసుకోవడంతో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.








Leave a Reply