NewsInn

News in a Click

మైహోమ్ రామేశ్వర రావు నుంచి శిఖం భూమికి విముక్తి …!

మైహోమ్ రామేశ్వర రావు నుంచి శిఖం భూమికి విముక్తి …!

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ప్రముఖ రియల్ ఎస్టేట్ మై హోమ్ చేరలో ఉన్న రూ.1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా విముక్తి కల్పించింది.ఐటీ కారిడార్‌లోని మాధాపూర్‌లో చెరువును మాయం చేయాల‌నే క‌బ్జాద‌దారుల ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్ స‌ర్వే నంబ‌రు 7లో ఉన్న 6.05 ఎక‌రాల ఈదుల‌కుంటను క‌బ్జాల చెర నుంచి విడిపించింది. శిల్పారామం ఎదురుగా ఉన్న త‌మ్మిడికుంట నిండితే వ‌ర‌ద కాలువ ద్వారా ఈదుల కుంట‌కు నీరు చేరేది. ఆ కాలువ‌ను డైవ‌ర్ట్ చేయ‌డంతో ఈదుల కుంట‌కు వ‌ర‌ద‌ నీరు చేర‌కుండా చేశారు. చెరువు రూపురేఖ‌లు మార్చేసి.. హ‌ద్దులు చెరిపేసి… ఇక భ‌వ‌న నిర్మాణాలే ఆల‌స్యం అనుకున్న త‌రుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్ర‌యించారు. త‌మ్మిడికుంట – ఈదుల‌కుంట‌- సున్నం చెరువులుగా గొలుసుక‌ట్టుగా ఉన్న వాటిలో ఈదుల కుంట మాయ‌మౌతోంద‌ని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో కూడా కేసు న‌మోద‌య్యింది. స్థానికుల ఫిర్యాదుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రాకు అక్క‌డ చెరువు ఆన‌వాళ్లు క‌నిపించాయి.

గ్రామ‌, రెవెన్యూ రికార్డుల మేర‌కు 6.05 ఎక‌రాల చెరువున్న‌ట్టు నిర్ధారించుకుంది. ఇదే విష‌యాన్ని నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ శాటిలైట్ చిత్రాలు కూడా నిర్ధారించాయి. దీంతో మంగ‌ళ‌వారం చెరువు హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది. 6.05 ఎక‌రాల ఈదుల‌కుంట‌కు తోడు.. ఆ ప‌క్క‌నే స‌ర్వే నంబ‌రు 11/37లో ఉన్న 5.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎక‌రాల భూమిని కాపాడిన‌ట్టు అయ్యింది. ఇలా మొత్తం మాధాపూర్‌లోనే దాదాపు రూ. 1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. ఈ భూమి చుట్టూ హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *