NewsInn

News in a Click

ఉచిత కరెంట్‌ను ఎగగొట్టేందుకే రైతు డిస్కం

ఉచిత కరెంట్‌ను ఎగగొట్టేందుకే రైతు డిస్కం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తా అని ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకున్న నిన్న ముఖ్యమంత్రి రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకి కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి, సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే, రైతన్నలకు ఉచిత కరెంట్‌ను విద్యుత్ సరఫరాను ఆపేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ‘రైతు డిస్కం’ అంటే రైతన్న మెడకు ఉరి పెట్టినట్టే అన్నారు. రైతు డిస్కం ద్వారా ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న తెలంగాణ పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు.

Ktr Speaking in BRS Cadre Meeting

రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీ నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమయింది అని కేటీఆర్ అన్నారు. అందుకే ఈరోజు రైతు డిస్కం పైన రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నీ ముమ్మాటికి అబద్ధాలే అన్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు పరచకుండా, తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతన్నలు గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంట్ కోతలని పూర్తిగా తీర్చేలా చేసింది కేసీఆర్ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ కరెంట్ కోతలు ఎంత తీవ్రంగా ఉండేవో గుర్తు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. కరెంట్ కోసం రైతన్నలతో పాటు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు హాలిడేలు ప్రకటించి, పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి మర్చిపోవద్దన్నారు. అంతటి దుస్థితి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని పనిని కేసీఆర్ గారు చేసి, 24 గంటల కరెంట్ రాష్ట్రానికి అందించిన నాయకుడు ముమ్మాటికి కేసీఆర్ అన్నారు. 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కానీ కేసీఆర్ గుర్తులు చెరిపేస్తా అన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరానికి అప్పటి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బిఆర్ఎస్‌ని గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశం మొత్తం తిరస్కరిస్తే… తెలంగాణలో ఆ దరిద్రం తిరిగి వచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *