NewsInn

News in a Click

త్యాగాలు-పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్

త్యాగాలు-పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలకు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం లోక్‌భవన్‌లో
గవర్నర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆధునిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా స్మరించుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అనే సూక్తిని ప్రస్తావిస్తూ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని పేర్కొన్నారు.
తెలంగాణ శతాబ్దాల నాటి సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వ్యవసాయ వారసత్వం రాష్ట్ర అసలైన జీవనాడిగా నిలిచాయని గవర్నర్ అన్నారు.

Telangana formation Day celebrations at lok bhavan

కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల నుంచి నేటి ఆధునిక సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతాంగం చేసిన కృషి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు.
వ్యవసాయ రంగంతో పాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ తదితర రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలు, ‘సర్వే భవంతు సుఖినః’ అనే ఆదర్శ స్ఫూర్తితో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, నగరాల ఆధునికీకరణ సమపాళ్లలో సాగుతూ సుసంపన్న తెలంగాణ నిర్మాణం జరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *