NewsInn

News in a Click

కాంగ్రెస్ లో స‌ర్వే క‌ల‌క‌లం- సీఎం సీరియ‌స్

కాంగ్రెస్ లో స‌ర్వే క‌ల‌క‌లం- సీఎం సీరియ‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అధికార కాంగ్రెస్ పార్టీలో హెచ్ఎంఆర్ స‌ర్వే క‌ల‌క‌లం రేపుతోంది. ప‌బ్లిక్ ప‌ల్స్ 2026 పేరుతో నిర్వ‌హించిన స‌ర్వే కాంగ్రెస్ నేత‌లను క‌ల‌వ‌ర‌పెడుతోంది.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై రెండున్న‌రేళ్లు పూర్తి కావ‌డంతో ఇటీవ‌ల హెచ్ ఎం ఆర్ స‌ర్వే సంస్థ రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే నిర్వ‌హించింది. తెలంగాణా ప‌బ్లిక్ ప‌ల్స్ పేరుతో నిర్వ‌హించిన స‌ర్వే ద్వారా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,19,595 శాంపిల్స్ సేక‌రించింది. ప్ర‌భుత్వ తీరుపై ప‌లు అంశాల‌పై ప్ర‌జా భిప్రాయాన్ని వెల్ల‌డించింది. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 41.07% ఓట్లతో 70 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 35.94% ఓట్లతో 36 సీట్లు సాధిస్తుందని తేల్చి చెప్పింది. మంత్రి వ‌ర్గంలోని కీల‌క మంత్రులు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని స్ప‌ష్టం చేసింది. క‌నీసం ఐదు మంది మంత్రులు ఓట‌మి చెందే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేసింది. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల ప‌నితీరు స‌హా…. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై పూర్తి స్థాయిలో ఆరా తీసింది. ప్రభుత్వానికి ఏ ఏ అంశాలు సానుకూలంగా ఉన్నాయో…ఏ అంశాల్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటుందో అంచ‌నా వేసింది. జిల్లా వారిగా కూడా హెచ్ ఎం ఎర్ సంస్థ స‌ర్వే వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఒక్కో జిల్లాల్లో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉందో అంచ‌నా వేసింది.

గ్రేట‌ర్ లో నో ఛేంజ్…..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పెద్ద‌గా మార్పులు లేవు. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆధిక్య‌త‌లో ఉంది. ప‌శ్చిమ రంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిక్య‌త‌లోనే ఉంద‌ని తేల్చి చెప్పింది. మెద‌క్ జిల్లాల్లో బీఆర్ ఎస్ రెండు స్థానాల్లో మాత్ర‌మే వెనుక‌బ‌డి ఉంద‌ని తేల్చింది. సంగారెడ్డి, ఆంధోల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ కే విజ‌య‌వ‌కాశాలున్నాయ‌ని ప్ర‌క‌టించింది. పాల‌మూరు జిల్లాలోని 14 స్థానాల్లో ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఆధిప‌త్యంలో కొన‌సాగుతుండ‌గా బీఆర్ ఎస్ 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు ద‌క్కించుకుంద‌ని తేల్చి చెప్పింది. కోడంగ‌ల్ లో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 49 శాతం ఓట‌ర్ల మ‌ద్ద‌తుతో జిల్లాలో అత్య‌ధిక మ‌ద్ద‌తు ఉన్న ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. అమాత్యులు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మ‌క్త‌ల్, కొల్లాపూర్ ల‌లో కూడా వారికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. ఇవి కాకుండా కాంగ్రెస్ కు గ‌ద్వాల‌, క‌ల్వ‌కుర్తి, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిక్యత‌లో ఉంద‌ని హెచ్ ఎం ఆర్ వెల్ల‌డించింది.

వ‌రంగ‌ల్ లో బీఆర్ఎస్ ఆధిప‌త్యం….

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ క్ర‌మంగా పెరుగుతున్నా….న‌ల్గొండ జిల్లాలో ప్ర‌స్తుతం ఒక స్థానంతో పాటు మ‌రో నాలుగు స్థానాల్లో బ‌లం పుంజుకుంద‌ని తేల్చింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధికంగా 7 స్థానాల్లో ఆధిప‌త్యంలో కొన‌సాగుతుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. దేవ‌ర‌కొండ‌, హుజూర్ న‌గ‌ర్, కొదాడ‌, న‌ల్గొండ‌, మునుగోడు, న‌కిరేక‌ల్, ఆలేరులో అధికార పార్టీ ఆధిప‌త్యంలో కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది. వ‌రంగ‌ల్లోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ ఎస్ కు 7 స్థానాల్లో ఆధిప‌త్యంలోకి వ‌చ్చింద‌ని, 5 స్థానాల్లో స్టేష‌న్ ఘ‌న్ పూర్, డోర్న‌క‌ల్,మ‌హ‌బూబ్ బాద్, వ‌రంగ‌ల్ ఈస్ట్, భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని మిగిలిన స్థానాల్లో బీఆర్ ఎస్ ప‌ట్టు భిగిస్తోంద‌న్న నివేదికను హెచ్ ఎం ఆర్ ఇచ్చింది.ఖ‌మ్మం జిల్లాలో పిన‌పాక‌, పాలేరు, మ‌ధిర‌, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఆధిప‌త్యంలో కొన‌సాగుతుండ‌గా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ కు విజ‌యావ‌కాశాలున్నాయ‌ని స‌ర్వే తేల్చింది. క‌రీంగ‌న‌ర్ జిల్లాలో రామ‌గుండం, మంథ‌ని, చొప్ప‌దండి మిన‌హా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ బ‌లంగా ఉంద‌న్న అంచ‌నా వేసింది.

నిజ‌మాబాద్ లో పోటాపోటీ….

నిజ‌మాబాద్ జిల్లాలో మాత్రం ప్ర‌ధాన పార్టీల‌న్నీ పోటాపోటీగా ఉన్నాయ‌ని తేల్చింది. బీజేపీ 3,కాంగ్రెస్ 3, బీఆర్ ఎస్ 3 స్థానాలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఆదిలాబాద్ లో మంచిర్యాల మిన‌హా బీఆర్ ఎస్ 7, బీజేపీ 2 స్థానాలు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌ర‌స్తితుల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని హెచ్ ఎంఆర్ స‌ర్వే నివేదిక‌లో తేల్చి చెప్పింది.

సీఎం సీరియ‌స్…..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రో రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ఉండ‌డంతో ఇప్ప‌డే ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకోవాల‌ని లేని ప‌క్షంలో కొత్త నేత‌ల‌కు ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక‌లు సీఎం చేస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌ర్వే ఫ‌లితాలు బీఆర్ ఎస్ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో 70 స్థానాలు గెలుచుకునే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేయ‌డంతో…రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మ‌రింత పెరిగే చాన్స్ ఉంద‌ని గులాబీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *