(హైదరాబాద్,న్యూస్ఇన్)
గడిచిన 30 నెలలుగా సమాజంలో గౌరవం పెంచుకుంటూ విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించుకుంటూ వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు.వచ్చే 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లను విడుదల చేయాలన్న సంకల్పంతో తొలి విడతగా 41.37 లక్షల రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడానికి వీలుగా రూ. 2,482.02 కోట్లను సర్కార్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1600 రైతు వేదికల ద్వారా రైతాంగం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఆ రంగానికి చేసిన ఖర్చు గణాంకాలను ముఖ్యమంత్రి గారు రైతులకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వ్యవసాయ రంగానికి రూ. 1.75 లక్షల కోట్లను ఖర్చు చేశాం. వచ్చిన మొదటి ఏడాదిలోగా 25.35 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రూ. 20,677 కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
కాళేశ్వరం చుక్క నీరు వాడలేదు…..
గత ప్రభుత్వంలో బకాయి పడిన రూ. 7 వేల కోట్ల రైతు భరోసా నిధులను చెల్లించాం. రూ. 10 వేలు ఉన్న రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచాం. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 27 వేల కోట్ల పైచిలుకు రైతు భరోసా నిధులు జమ చేశాం. తాజాగా ఇప్పుడు జమ చేయబోయే నిధులతో కలిపి రైతు భరోసా కింద 36 వేల కోట్లు చెల్లించాంమని చెప్పారు.వ్యవసాయ రంగానికి సగటున నెలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం వెల్లడించారు.
ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పుల ఊబిలోకి బీఆర్ ఎస్ నెట్టిందన్నారు. ముంచారు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను ప్రజల ముందు పెట్టామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు వాడకుండా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం ఉత్పత్తి చేశామని సీఎం అన్నారు.
చేసేదే చెప్తా. చెప్పిందే చేస్తా…….

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాట పట్టించామని, 11 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు అప్పగించి యజమానులను చేశామన్నారు. ఏం ఉన్నదో అదే చెప్తా. చేసేదే చెప్తా. చెప్పిందే చేస్తా. కుండబద్ధలు కొట్టినట్టు చెబుతా. మాట మాట్లాడితే దానిపై నిలబడుతా. అబద్ధాల పునాదులపై ఈ ప్రభుత్వాన్ని నడపలేమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎల్ నినో ప్రభావం….
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. అందుకే పంట మార్పిడి చేయాలని చెబుతున్నాం. రైతుల కష్టాలేంటో తెలిసిన వాళ్లం. అందుకే అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. కొందరు దాన్ని కూడా తప్పుబడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.












Leave a Reply