(హైదరాబాద్, న్యూస్ఇన్)
వచ్చే ఏడాది క్యూర్ పరిధిలో కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే వచ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతగా 16 నియోజవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మరో 8 నియోజకవర్గాలలో కూడా ఈ పధకం అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదవాడి సొంతింటి కల నెరవేరేవరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం కొనసాగుతుందని, చివరి లబ్దిదారునికి ఇల్లు అందేవరకు కొనసాగుతుందని , ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో కలిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత పాలకులు పనికిరాని ఆలోచన కారణంగా ఎన్నికల సమయంలో హైదరాబాద్కు 30-35 కిలోమీటర్ల దూరంగా ఇళ్ళను నిర్మించడం వలన కేవలం 8-9 వేల మంది మాత్రమే నివాసాల్లో దిగారని , మిగిలిన వారు మంజూరు పత్రాలు తీసుకున్నారే తప్ప దిగలేదన్న విషయం తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా పేదలు నివాస ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల వైశాల్యంతో సుమారు 40-60 లక్షల రూపాయిల విలువ కలిగిన స్ధలాలను ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. దీనిని పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం ఉండదని, అయితే బ్యాంకులో రుణం కోసం తనఖా పెట్టుకోవచ్చునని తెలిపారు. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుందన్నారు ఇల్లు మంజూరు కాకపోతే కట్టిన రూ.10 వేల రూపాయిలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల రూపాయిలను ఉచితంగా ఇస్తుందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 11 లక్షల రూపాయిల వరకు ఖర్చు అవుతున్నందున లబ్దిదారుల నుంచి మిగిలిన ఆరు లక్షల రూపాయిలను నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామని , ఆ మొత్తంలో ఈ 10 వేల రూపాయిలను మినహాయిస్తామని మంత్రి గారు తెలిపారు.
ఈనెల 21వ తేదీ నుంచి మీసేవ, వాట్సాప్ ( నెంబర్ 8096958096), వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుంటున్నామని ఉచిత బస్సు, ఉచిత కరెంట్, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభపరిణామం అన్నారు.

ఇళ్ల నిర్మాణాలు చేపట్టే నియోజకవర్గాలు…..
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్దేవ్పల్లి;
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్పల్లి;
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గం;
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తట్టిఅన్నారం, బండ్లగూడ;
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌకూర్;
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రెడ్హిల్స్ మరియు నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్;
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హకీంపేట్ దర్గ మరియు జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల్సుంపురా సమీప పోలీస్క్వార్టర్స్;
బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిముసలిగూడ;
అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిటీపోలీస్ లైన్స్
కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కేపీహెచ్బీకాలనీ;
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోచారం ఎల్ఐజీకాలనీ;
కుత్బుల్లాపూర్ అసెం బ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం;
సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాటిగడ్డ;
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మారేడ్పల్లి–మహేంద్రహిల్స్;
మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం ఆర్అం డ్ బీ క్వార్టర్స్. ఉన్నాయి












Leave a Reply