(హైదరాబాద్,న్యూస్ఇన్)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కండ కోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. గోల్కండలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కండ కోటకు చేరుకున్న సీఎంకు పోలీసుల గౌరవ వందంనం స్వీకరించారు.

పేదవాడికి ఆకలి నుంచి విముక్తి… రైతుకు అప్పుల నుంచి విముక్తి… మహిళకు ఆర్థిక స్వేచ్ఛ… యువతకు ఉపాధి… బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్లు అని అన్నారు.మహాత్మాగాంధీ, స్వాతంత్ర్య సమరయోధులు చూపిన మార్గంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగాలకు వేసిన పునాదుల స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన విధానాలు, చట్టాలు, భారీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బలమైన పునాదులు వేస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిందన్నారు. 32 నెలల ప్రజాపాలన ఫలితాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.

రైతుల కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంలో భాగంగా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం అన్నారు. మహిళా సాధికారత విషయంలో తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు పెట్రోల్ బంకులు, రైసు మిల్లులు, ప్రైవేటు బస్సులు నడిపే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 15 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. పేద ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా కులగుణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. విద్యా పరంగా ఎన్నో సంస్కరణలు అమలు చేసి పటిష్ట విద్యావిధానం దిశగా అడుగులు వేస్తునట్లు చెప్పారు. వైద్య పరంగా రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా 10 లక్షల రుపాయల వరకు ఆర్ధిక సహాయం అందేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలో కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తా మన్నారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిథ సిటీగా నిర్మాణం చేస్తామన్నారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
.












Leave a Reply