(న్యూస్ఇన్, హైదరాబాద్)
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తి కరమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కూడా లేవని ఆయన తరపు న్యాయ వాది గౌరవ్ అగర్వాల్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని పార్టీ మారినట్లు నిర్ధారించడం సాధ్యం కాదన్నారు. అనర్హత పిటిషన్ లో లేని అంశాలను తరువాత అదనపు అఫిడవిట్ ద్వారా తీసుకొచ్చి పరిశీలించేందుకు అవకాశం లేదని వాదించారు. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది.పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పలువురు బీఆర్ ఎస్ నేతలు వేర్వేరుగా కేసులు వేశారు.
దానం తరఫున సీనియర్ అడ్వొకేట్ గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, 2024 మార్చి 15న సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని దానం కలిశారని, దానం నాగేందర్కు త్రివర్ణ కండువా కప్పడంతో మార్చి 17న కాంగ్రెస్లో చేరారని భావించి అనర్హత వేటు వేయాలని కోరడం అన్యాయమన్నారు. ఇందుకు సంబంధించిన వార్తాపత్రికల ఫొటోలు, కథనాల్లో దానం కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించినట్లు ఎక్కడా లేదన్నారు. తాను కాంగ్రెస్లో చేరినట్లుగా దానం నాగేందర్ ఎక్కడా ప్రకటించలేదన్నారు.

సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కూడా అనర్హతకు ప్రాతిపదికగా ఇప్పుడు పేర్కొంటున్నారని న్యాయవాది చెప్పారు. ఈ అంశం మొదటి అనర్హత పిటిషనన్ లో లేదని గుర్తు చేశారు. ఆ తరువాత అదనపు అఫిడవిట్ ద్వారా చేర్చిన విషయాలను విచారణకు తీసుకోవడం చెల్లదన్నారు. కాంగ్రెస్ నాయకులను కలవడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు తేల్చేందుకు తగిన ఆధారాలుగా సరిపోవని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపు జరిగిందని ఆరోపిస్తున్న తేదీ నాటికే అనర్హతకు కారణమయ్యే చర్య చోటుచేసుకుని ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం చూపుతున్న ఆధారాలు మీడియా కథనాలు, ఊహాగానాలు, అసెంబ్లీ వెలుపల జరిగిన వ్యక్తిగత సమావేశాలకే పరిమితమయ్యాయని తెలిపారు. అసెంబ్లీ వెలుపల వ్యక్తిగత హోదాలో దానం నాగేందర్ నిర్వహించిన కార్యక్రమాలు, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ నాయకులతో భేటీలను శాసనసభ కార్యకలాపాలతో అనుసంధానించలేమని గౌరవ్ అగర్వాల్ అన్నారు. 2024 మార్చి 21న కాంగ్రెస్ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉందని పిటిషనర్ చెబుతున్నప్పటికీ, అనర్హత పిటిషన్ లో నిర్ధారించాల్సిన ప్రధాన అంశం మార్చి 15 నాటికి ఆయన పార్టీ ఫిరాయించారా లేదా అన్నదేనని పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.












Leave a Reply