NewsInn

News in a Click

కొత్త నేర చట్టాల అమలుపై సదస్సు- టెక్నాలజీపై దృష్టి

కొత్త నేర చట్టాల అమలుపై సదస్సు- టెక్నాలజీపై దృష్టి

(న్యూస్ఇన్, హైదరాబాద్‌)

కొత్త నేర చట్టాలైన BNS, BNSS, BSA అమలులో వివిధ విభాగాల మధ్య సమన్వయం, డిజిటల్‌ వేదికల వినియోగం కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, పోలీస్‌ శాఖ సంయుక్తంగా గురువారం నిర్వహించిన సదస్సులో న్యాయవ్యవస్థ, పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, జైళ్లు, ఫోరెన్సిక్‌, వైద్య విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది హైబ్రిడ్‌ విధానంలో పాల్గొన్నారు.

సమన్వయమే కీలకం

నేరం నమోదైనప్పటి నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్‌, ప్రాసిక్యూషన్‌, కోర్టు విచారణ వరకు ప్రతి దశలో సమన్వయం అవసరమని జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

డిజిటల్‌ పరిజ్ఞానం పెంచాలి

జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, జైళ్ల శాఖల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగాలని అన్నారు. డిజిటల్‌ వేదికలపై సిబ్బందికి మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

శాస్త్రీయ దర్యాప్తుపై డీజీపీ దృష్టి

డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. కొత్త నేర చట్టాలు పౌర కేంద్రిత న్యాయం, శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్‌ ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ రికార్డులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ఈ-సాక్ష్య, ఈ-ఎఫ్‌ఐఆర్‌, ఈ-సమన్లు, ఆన్‌లైన్‌ ఛార్జిషీట్లు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్ష్యాల నమోదు వంటి అంశాలపై సదస్సులో చర్చించారు.

కొత్త నేర చట్టాల అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించేలా సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని డీజీపీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *