NewsInn

News in a Click

నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు

నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు

గండిపేటలో మ‌ధుర‌స్మృతులు

విలువలతో కూడిన విద్యను అభ్యసించండి

ఎన్టీఆర్ పట్టుదలే నారా భువనేశ్వరికి వచ్చింది

ఏపీ సీఎం చంద్రబాబు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

గండిపేట ప్రాంగణానికి రాగానే మ‌ధుర‌ స్మృతులు, అనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు.ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 లో ఎంపిక‌య్యార‌ని,జూనియర్ సివిల్ జడ్డీలుగా ఎంపికయ్యారన్నారు. దేశంలోని వివిధ ప్రముఖ విద్యా సంస్థల్లో 29 మందికి సీట్లు వచ్చాయన్నారు. 131 మంది విద్యార్థులతో విద్యా సంస్థను ప్రారంభించాం… ఇప్పుడు 1641 మంది చదువుతున్నారు. సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం.”అని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. గండిపేట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేది. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా గండిపేట ఉండేది.. ఇప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశాం. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించాం.

చదువు ముఖ్యం… విలువలు మరింత ముఖ్యం

సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమే. మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు. ఆధునాతన విధానాల్ని అందిపుచ్చుకోవాలి… విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎడిషనల్ కోర్సులు చేయండి. నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి. విద్యతో పేదరికాన్ని జయించవచ్చు.నేను ఇంకా పేపర్ చూసి స్పీచ్ ఇస్తున్నాను… భువనేశ్వరి ట్యాబ్ చూసి స్పీచ్ ఇస్తున్నారు. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను… భువనేశ్వరి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరికి పట్టుదల ఉంది… మొండితనమూ ఉంది. భువనేశ్వరి ఏదైనా చేయాలని సంకల్పం తీసుకుంటే పట్టుదలతో చేస్తారు.

ఎన్టీఆర్ స్పూర్తితో సేవలందిస్తున్నాం : భువనేశ్వరి

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ…”విద్యార్థుల ఆశలకు అనుగుణంగా వారి భవిష్యత్తును రూపుదిద్దుతున్నాం. మానవ సేవే మాధవ సేవ అని ఎన్టీఆర్ నమ్మారు.. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ పని చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హెల్త్ కేర్ సర్వీసులు, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్కులు పని చేస్తున్నాయి. పేద, అనాధ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లు ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో ఉన్నారు. బాహ్య ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది… దానికి ఇక్కడి నుంచే సంసిద్దమవ్వండి. కోట్లాది మంది హృదయాలను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో.. ఆయన చూపిన దారిలో ఎన్టీఆర్ విద్యా సంస్థలను, ఎన్టీఆర్ ట్రస్టును నడుపుతున్నాం.”అని భువనేశ్వరి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *