‘హైదరాబాదీ’ స్టైల్లో సజ్జనార్ ట్వీట్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నిన్న మొన్నటి వరకు కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర ప్రజలను తన సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్…ఇప్పుడు సంక్రాంతి పండుగపై ప్రజల్లో తెచ్చేందుకు తనదైన పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. గ్రామాలకు వెళ్లే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అదే విధంగా పతంగ్ (గాలి పటాలు) ఎగురవేసేందుకు వినియోగించే మంజా పై అలెర్ట్ చేస్తున్నారు. మంజా వినియోగంపై నిషేధం ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ… చైనా మంజాను వాడరాదంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కువగా పతంగ్ లు ఎగుర వేసే అవకాశం ఉండడతో నగరాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కా హైదరాబాదీ స్లాంగ్ లో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

చైనా వస్తువుల గురించి ఉన్న సామెతను సజ్జనార్ ప్రస్తావించారు. “చైనా కా మాల్ చలే తో చాంద్ తక్.. వర్నా షామ్ తక్’’ ( చైనా వస్తువులు ఉంటే చంద్రుడి దాకా…….. లేదంటే సాయంత్రం దాకా) అని సరదాగా అనుకుంటాం. ఇదే సామెతను ప్రస్తావిస్తూ సజ్జనార్ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతి పండగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడొద్దంటూ హైదరాబాదీ యాసలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.”మిగతా చైనా వస్తువుల సంగతి ఎలా ఉన్నా.. చైనా మాంజా మాత్రం అలా కాదు భాయ్! ఇది పక్కాగా ప్రాణాలకు గ్యారంటీగా ప్రమాదం తెస్తుంది” అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని హితవు పలికారు. చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని, ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు.
ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. నగరంలోని అన్ని జోన్లలోని కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములపై టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
కేవలం విక్రయదారులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని, వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందని, దీనివల్ల ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడంతో పాటు, పిల్లల వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉందని వివరించారు. అంతేకాకుండా, ఇందులో ఉండే మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారాలను మాత్రమే ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.
సంక్రాంతి ఆనందం విషాదంగా మారకూడదంటే… #SayNoToChineseManja# అని పిలుపునిచ్చారు. గాజు పొడి అద్దిన మాంజా, నైలాన్ దారాలను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.





Leave a Reply