NewsInn

News in a Click

మేడారం జాత‌ర ఆహ్వానాలు పంపిణీ చేసిన సీత‌క్క‌

అసెంబ్లీలో జాత‌ర హ‌డావుడి

(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

ఈ నెలాఖ‌రున జ‌రిగే మేడారం జాత‌ర ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను మంత్రి సీత‌క్క అసెంబ్లీలో అమాత్యుల‌కు అంద‌చేశారు. ఈ గిరిజ‌న జాత‌ర‌కు రావాల‌ని ఒక్కొక్క‌రిని వారి ఛాంబ‌ర్ ల‌కు వెళ్లి సీత‌క్క మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు.
మేడారం ఈఓ వీరస్వామి, సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పలువురు పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టి, కండువా కప్పి, బంగారం అందజేసి మేడారం జాతరకు ఆహ్వానించారు. ప్రముఖులకు అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేసి మహా జాతరకు రావాలని మంత్రులు కోరారు. అసెంబ్లీ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే లోక్ భ‌వ‌న్ కువెళ్లి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను కూడా జాత‌ర‌కు హాజ‌రు కావాల‌ని సీత‌క్క ఆహ్వ‌నించారు.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.

మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క–సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా, పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీల గోడ‌ల నిర్మాణం పూర్తి కానుంది. ఆదివాసి సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం జాత‌ర‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న ల‌క్షలాది మంది భక్తులు మేడారాన్ని దర్శించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *