NewsInn

News in a Click

ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి ప్రధాని మోడీ పిలుపు

ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి ప్రధాని మోడీ పిలుపు

కృత్రిమ మేధ AI దుర్వినియోగమవుతోందని దీన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. టెక్నాలజీ ఏదైనా సరే మానవ కేంద్రంగా ఉండాలే తప్ప ఆర్థిక కేంద్రంగా ఉండకూడదని దక్షిణాఫ్రికాలోని జీ20 సదస్సులో అన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. కృత్రిమ మేధ ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్‌ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా చూడాలన్నారు. యాప్‌లను ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వాడుకునేలా రూపొందించాలని సూచించారు. ఏఐ, డిజిటల్‌ చెల్లింపుల్లో ఇండియా ముందంజలో ఉందన్నారు. ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్‌ ఎనర్జీ దిశగా మళ్లాలని పిలుపునిచ్చారు. క్లీన్‌ ఎనర్జీ కోసం రీసైక్లింగ్‌ను వేగవంతం చేసి సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గించాలని అన్నారు. జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాలు తమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *