NewsInn

News in a Click

లీకేజీల‌ కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలి- సీఎం

లీకేజీల‌ కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాలి- సీఎం

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవ‌ని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయ‌న్నారు. కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను క‌లిసిన అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. అనుమ‌తి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయ‌ని సీఎం విమ‌ర్శించారు. ఈ విష‌యంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్ర‌య‌త్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాల‌ని సీఎం సూచించారు. విద్య‌ను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ఈ అంశంపై పార్ల‌మెంట్ చర్చ జరగాల్సి ఉంద‌న్నారు. స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితే రాహుల్ గాంధీ అన్ని అంశాల‌పై మాట్లాడతార‌ని సీఎం తెలిపారు.

ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల నివార‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చ‌ట్టాన్ని చూసి త‌ర్వాత రాష్ట్రంలో ఏం చేయాల‌నేది చూస్తామ‌ని సీఎం ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు. యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామ‌ని సీఎం తెలిపారు. గ్లోబరీనా వ‌టి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా గ‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్ష‌ల వ‌ర‌కు విస్త‌రించి, వాటిని గంద‌ర‌గోళం చేశార‌ని సీఎం విమ‌ర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌ని సీఎం తెలిపారు.

ఫీజురీయింబర్స్‌మెంట్ కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం రూ.8వేల కోట్లను బకాయిలను పెట్టి పోయింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థలమీద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోంద‌ని సీఎం తెలిపారు. స‌క్ర‌మంగా ఉన్న‌వాళ్ల‌కు బ‌కాయిలు చెల్లిస్తామ‌ని ఓ ప్ర‌శ్న‌కు సీఎం బ‌దులిచ్చారు. గత ప్రభుత్వం బకాయిలే త‌మ‌కు భారంగా మారాయ‌ని, అయినా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం అన్నారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామ‌ని, అడ్వాన్స్‌డ్‌గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తామ‌ని సీఎం తెలిపారు.

హైడ్రా ప‌నుల‌ను కొన‌సాగిస్తాం……….

ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం విచక్షణాధికారమ‌ని, దానిని ఎవరూ గుంజుకోలేర‌ని సీఎం స్ప‌ష్‌టం చేశారు. చెరువులు, నాలాలు, కుంట‌లు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్క్‌లను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయ‌ని, అప్పుడు ఎందుకు మాట్లాడ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. న్యాయస్థానాల మీద త‌న‌కు సంపూర్ణమైన విశ్వాసం ఉంద‌ని సీఎం తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోంద‌ని, త‌మ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా ప‌క‌డ్బందీగా చేస్తోంద‌ని సీఎం తెలిపారు. గండిపేట చెరువులో ఆక్రమ‌ణ‌లు కూలగొట్టింది… అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నోళ్లు పేదోళ్లా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేద‌ని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామ‌ని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *