బీజేపీ అభ్యర్థులనే గెలిపించండి : ఎన్. రాంచందర్ రావు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ “వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026” పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విడుదల చేశారు. వికసిత్ తెలంగాణ మేనిఫెస్టోలో, తెలంగాణ మున్సిపాలిటీల్లో బీజేపి గెలిచిన వెంటనే అమలు చేయాల్సిన కీలక హామీలు స్పష్టంగా పొందుపరిచారు. అవినీతి రహిత పాలన, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధికే వినియోగించడం, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను అమలు చేయడం ఈ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని రాంచందర్ రావు అన్నారు. మున్సిపాలిటీలలో ఎలాంటి అవినీతికి తావుండదని, ప్రభుత్వ లేదా మున్సిపల్ భూముల ఆక్రమణలు, నిధుల మళ్లింపుకు (డైవర్షన్) ఎటువంటి అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పారు. పార్టీకి చెందినవారు గానీ, అధికారులు గానీ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రామగుండంలో అభ్యర్థిని బెదిరించి విత్డ్రా చేయించిన ఘటన, మంచిర్యాలలో కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగిన విషయాలను ప్రస్తావించారు.కర్ణాటకలో తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లును అనుకరిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం బీజేపీ నేతలు, కార్యకర్తలను ఇరికించేందుకు, అక్రమంగా కేసులు బనాయించేందుకు మాత్రమే ఉద్దేశించినదని విమర్శించారు.








Leave a Reply