NewsInn

News in a Click

తిరుమ‌లలో ఆస్థానం- విఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌లలో ఆస్థానం- విఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌)

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే అతి ముఖ్యమైన పర్వదినాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. మార్చి 19న శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తిరుమలలో ‘ఆస్థానం’ అంటే ఒక ప్రత్యేకమైన దర్బారు లేదా కొలువు అని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్వామివారు తన పరివారంతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ, ఆ ఏడాది పంచాంగాన్ని వినే కార్యక్రమాన్నే ఆ స్థానంగా పిలుస్తారు.ఉగాది ఉత్స‌వాల సంద‌ర్బంగా తిరుమ‌ల‌ను అత్యంత సుంద‌రంగా తీర్చి దిద్దుతారు.

ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఉదయం సుప్రభాత సేవ, శుద్ధి వంటి నిత్య కైంకర్యాలు పూర్తి చేస్తారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారీలతో (శ్రీదేవి, భూదేవి) కలిసి, సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారితో కలిసి సర్వభూపాల వాహనంపై వేంచేస్తారు.

ఆలయ సిద్ధాంతి స్వామివారి సన్నిధిలో ఆ సంవత్సరపు ఆ ‘పంచాంగ శ్రవణం’ చేస్తారు.అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి, పండితులకు ‘అక్షింతలు’, ‘వస్త్ర బహుమానం’ చేస్తారు. సప్తగిరులపై శ్రీవేంకటేశ్వరునికి ఉగాది నుంచి ఉత్సవాలు, ఊరేగింపులు మొదలై…. మళ్లీ ఉగాది నాటికి పూర్తవుతాయి. తిరుమలలో ఉగాది పండుగ రోజున జరిగే తొలి వార్షికోత్సవం ‘ఉగాది కొలువు’ ‘వేంకటేశుడి ఉగాది దర్బార్‌’‌.తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారికి అర్చకులు ఆరు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. వీటిలో నాలుగు మూలమూర్తికి.. మిగతా రెండింటిలో ఒకటి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామికి, రెండోది విష్యక్సేనులవారికి అలంకరిస్తారు.

మూలమూర్తి సమర్పించే నాలుగింటిలో ఒకటి స్వామివారి కిరీటానికి, రెండోది నందకం (ఖడ్గం), మూడోదానిని ఆది తోమాలగా.. నాలుగోదానిని ఉత్తరీయంగానూ అలంకరిస్తారు.ఉగాది ఆస్థానం అనేది ఆలయం లోపల జరిగే ఏకాంత సేవ వంటిది అయితే, ఆ సమయంలో ఆలయంలో ఉన్న భక్తులు దూరం నుండి దర్శించుకోవచ్చు.

విఐపి సిఫార‌సు లేఖ‌లు ర‌ద్దు………….

మార్చి 19న రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ మినహా) రద్దు చేస్తారు. అలాగే సిఫార్సు లేఖలను స్వీకరించరు. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. దీనివల్ల సాధారణ భక్తులకు సర్వదర్శనం కోసం ఎక్కువ సమయం దొరుకుతుంది.
తిరుమలలో ఉగాది పండుగ జరుపుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. మధ్యయుగ కాలం నుండి, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలం నుండి తిరుమలలో పండుగలను శాస్త్రోక్తంగా నిర్వహించడం పెరిగింది.


సాధారణంగా హిందూ సంప్రదాయంలో ‘చైత్ర శుద్ధ పాడ్యమి’ రోజున కొత్త సంవత్సరం మొదలవుతుంది. స్వామివారు ఈ సృష్టికి అధిపతి కాబట్టి, ఆయనే స్వయంగా కొత్త సంవత్సర కాలాన్ని స్వీకరిస్తారనే నమ్మకంతో ఈ ‘ఆస్థానం’ నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *