NewsInn

News in a Click

ఆర్టీసి స‌మ్మె వ‌ద్దు….ప్లీజ్- మంత్రి పొన్నం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని, ఇది సంస్థకు మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని ఆర్టీసి కార్మికులు స‌మ్మె నోటీసును విరమించుకోవాల‌ని కోరారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం మరియు కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎల్లవేళలా తమ తలుపులు తెరిచి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని ఎన్నికల షెడ్యుల్ కు 10 రోజులకు ముందు హడావిడిగా విలీనం అంశాన్ని ముందుకు తీసుకువచ్చారని గుర్తుచేశారు.గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా , కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఎడి సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి మరియు ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *