(తిరుమల,న్యూస్ఇన్)
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని తిరుమల సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చందుకు అనుగుణంగా నిర్ణయాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖారు నాటికి బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇవ్వరాదన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.రాబోయే రెండు,మూడు నెలల పాటు పెద్ద ఎత్తున భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పలు మార్పులు చేయాలన్న యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది.
మే, జూన్, జులై నెలల్లో సగటున 20 లక్షల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించినట్లు రికార్డులున్నాయి. ఈ లెక్కలు పరిశీలించిన టీటీడీ వేసవి సెలవుల దృష్ట్యా.. వీఐపీ బ్రేక్, ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేయాలని సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తిరుమలలో వీఐపీ దర్శనాల కోసం రోజూ 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. విఐపీ సిఫారుసులతో వచ్చిన భక్తులు సుమారు 4000 వేల మంది వరకు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సిఫారసు లేఖలను రద్దు చేస్తే….. దాదాపు 15 నుంచి 18 మంది సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం చేయించే అవకాశం ఉన్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది. ఈ కారణంగానే విఐపీ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం అమలు చేసేందుకు టీటీడీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా దీనిపై టీటీడీ ప్రకటన చేసే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్బంగా అనుసరించిన విధానాలను అమలు చేస్తే రోజుకు సగటును 80 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం వస్తుందని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.







Leave a Reply