(హైదరాబాద్,న్యూస్ఇన్)
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో రైల్వే ప్రాంగణంలో జరిగిన మొదటి సమావేశం ఇది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్.యూ.బి) / రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్.ఓ.బి ), కొత్త రైలు మార్గాల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి, స్టేషన్లకు అనుసంధాన మార్గాలు మొదలైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డు అండర్ బ్రిడ్జ్/రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనుల మంజూరు, అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అందవలసిన సహాయంపై విస్తృత చర్చ జరిగింది. ఎన్ఓసీలు, భూసేకరణ, ట్రాఫిక్ మళ్లింపు, విద్యుత్ లైన్లు, పైప్లైన్ల తరలింపు మొదలైన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని రైల్వే కోరింది. రాష్ట్రంలోని కొత్త రైల్వే లైన్లపై కూడా అధికారులు చర్చించి వాటికి సంబందించిన భూసేకరణ మరియు వ్యయ భాగస్వామ్యం మొదలైన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. హైదరాబాద్ను బెంగళూరు, చెన్నై, పూణేలతో కలిపే హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను కూడా అధికారులు సమీక్షించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ ఇటువంటి నిర్మాణాత్మక సమావేశాలు మరిన్ని జరగాల్సిన ఆవశ్యకతను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు రైల్వేల మధ్య సన్నిహిత సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని సమిష్టిగా కృషి చేసి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ రోజు చర్చించిన ప్రస్తుతం కొనసాగుతున్న రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే మద్దతు ద్వారా ఈ ప్రాజెక్టుల వేగం మరింతగా పెరుగుతుందని ఆయన తెలిపారు.











Leave a Reply