స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ స్మృతివనం
పొట్టిశ్రీరాములు స్పూర్తితో తెలుగుజాతిని అగ్రపథాన నిలిపేలా సుపరిపాలన
మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహా కుట్ర
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
(అమరావతి, న్యూస్ఇన్)
భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను సీఎం సత్కరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలను ప్రాణాలు తృణప్రాయంగా అర్పించి 58 రోజుల్లోనే సాకారం చేసిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములని సీఎం కీర్తించారు. అమరజీవి మరణంతో తెలుగు ప్రజలు ఉద్యమ బాట పట్టారని.. ఉద్యమ తీవ్రతను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారని అన్నారు. అమరజీవి త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం అవతరించిందని.

ఆ మహనీయుడిని శాశ్వతంగా స్మరించుకునేలా ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఏడాది పాటు జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ 15న 58 రోజుల దీక్షకు గుర్తుగా, మనందరికీ స్ఫూర్తి నింపేలా రాజధాని అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. జయంతి రోజున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని,ఇందుకోసం 6.8 ఎకరాల స్థలం కేటాయించా మన్నారు. ఇందులో పొట్టి శ్రీరాములు స్మృతి వనం, అలాగే ఆయన జీవిత విశేషాలతో మ్యూజియం సిద్ధం అవుతోందన్నారు.
పొట్టి శ్రీరాములుకు గుర్తింపు ఇచ్చింది ఎన్టీఆర్

పొట్టిశ్రీరాములు త్యాగానికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే 1985లో తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. 2003 ,మార్చి 10న నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టి కేంద్రానికి పంపాం. ఆ తర్వాతే కేంద్రం జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నోటిఫై చేసింది. అలాగే చెన్నైలో ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని నిర్ణయించాం. భావితరాలకు గుర్తుండేలా దానిని మెమోరియల్ గా తీర్చిదిద్దుతాం. అలాగే ఆర్య వైశ్యుల సెంటిమెంట్ ను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుంది.








Leave a Reply