(అమరావతి,న్యూస్ఇన్)
కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.గోదావరిలో కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గం.కు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు.

గోదావరిని కాపాడాలి….
గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరగాలి.. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్దాంమన్నారు. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్. సి. పి. నిధులు రూ. 416 కోట్లలో రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాల”ని ఆదేశించారు.
పేపర్ మిల్ కాలుష్యంపై ఆరా….

ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల మీద ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య నుంచి వివరాలు అడిగారు. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా లంకల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఆలోచిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు మరో శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.









Leave a Reply