NewsInn

News in a Click

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి

వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించండి

సీఎం చంద్రబాబు సమీక్ష

స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు

(అమరావతి,న్యూస్ఇన్‌)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్క్ర‌బ్ టైఫ‌స్ వ్యాధి గ్ర‌స్తులు పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం ఆ వ్యాధి పై దృష్టి పెట్టింది.వ్యాధిని అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని అన్నారు. రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

ఇది అంటువ్యాధి కాదు….

ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు… మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని ముఖ్యమంత్రికి తెలిపారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు చూడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *