(అమరావతి,న్యూస్ఇన్)
యూఏఈ తో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయూ సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది.
క్వాంటం స్పీడ్ తో అవకాశాలు అందుకోండి…..

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. పోర్టులు, రైల్వై, రోడ్డు వ్యవస్థతో ఏపీ లాజిస్టిక్స్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆగస్టు 1 తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలో అందుబాటులోకి వస్తోందని వివరించారు.
ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్
కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భారత్- యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.













Leave a Reply