NewsInn

News in a Click

2027లోనే అందుబాటులోకి ఉస్మానియా కొత్త‌ ఆసుప‌త్రి

2027లోనే అందుబాటులోకి ఉస్మానియా కొత్త‌ ఆసుప‌త్రి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ ఉండబోతున్నదని మంత్రి పేర్కొన్నారు. పేషెంట్లతో పాటు, ఉస్మానియాలో పనిచేసే సిబ్బంది, డాక్టర్లకు సౌకర్యవంతంగా ఉండేలా హాస్పిటల్ డిజైన్ చేయిస్తున్నామన్నారు. ఈ మేరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఉస్మానియా ఎంబీబీఎస్ విద్యార్థుల 175వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గవర్నర్ శివ్ ప్రతాప్‌ శుక్లాతో కలిసి విద్యార్థులకు మంత్రి పట్టాలు అందజేశారు. ప్రజల బాధను పంచుకుని, వారికి ఉపశమనం కలిగించే పవిత్రమైన వృత్తిలోకి అడుగు పెడుతున్నారని విద్యార్థులకు గుర్తు చేశారు. పేషెంట్లతో మానవత్వంతో వ్యవహరించాలని, ధనార్జనే ధ్యేయంగా ఉండకూడదన్నారు. డాక్టర్లకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

దశాబ్దాల ఉస్మానియా కొత్త హాస్పిటల్ కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని మంత్రి గుర్తు చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా గోషామహల్‌లో కొత్త ఉస్మానియాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌ రోజూ వేలాది మంది రోగులకు సేవలందిస్తోందని, ఇటీవల 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించడం ఉస్మానియా వైద్యుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. కొత్త భవనం అందుబాటులోకి రాగానే అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు, అత్యవసర చికిత్సలు మరింత విస్తృతంగా అందించగలమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నూతన ఉస్మానియా ఆస్పత్రి రాష్ట్ర వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *