(హైదరాబాద్,న్యూస్ఇన్)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత ప్రకటించారు.తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలం కానున్నారు. తెలంగాణ ఎవరి అయ్యా జాగీర్ కాదని, ఇక్కడే తన రాజకీయ జీవితం మొదలైన విషయాన్ని ప్రజలు గుర్తించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రస్తుతానికి రాజకీయాల కంటే ముందు ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలబడాలని తన పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇక తాను ఓ చెరువు కబ్జా చేశానని వార్తలు రాశారని, అదే నిజమైతే ఆ స్థలాన్ని రాసి ఇస్తానని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వేదికగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి.నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదని…. జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజలు ఆదరిస్తే చాలని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి పకడ్బందీగా ఎన్నికల బరిలో దిగుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. జై పాకిస్తాన్…. అన్నవాళ్లు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారని, పహల్గాం ఉగ్రదాడిని ఖండించని వారు కాంగ్రెస్ నేతలని పవన్ అరోపించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసి ఉందామని గతంలో తాను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి పోటీ చేస్తున్న అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన పార్టీ గురించి మాత్రం తాను చెబుతానని బిజెపి,టిడిపి గురించి ఆయా పార్టీలు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాయన్నారు.
గద్దర్ ను ఆదుకున్నా…
తెలంగాణలో వామపక్ష ఉద్యమ నేతగా నేతగా ఉన్న గద్దర్ ను తెలంగాణ నేతల కంటే తాను ముందుగా ఆదుకున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుల్లెట్ల కారణంగా తాను నడవలేకపోతున్నానని గద్దర్ ఆందోళన వ్యక్తం చేయడంతో… తాను కారు ఇప్పించిన విషయాన్ని పవన్ బయటపెట్టారు.

వై ఎస్ ను ఎదురించి….
ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో లేవని గొంతులు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడతారంటే లేస్తున్నాయన్నారు. వైయస్ ని ఆనాడు ఎదిరించి రాజకీయ పార్టీని ప్రారంభించానని పవన్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజల కోసం తాను ఉద్యమాలు చేసేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో వ్యతిరేకించిన ఎంఐఎం, సిపిఎం పార్టీల విధానాలను తెలంగాణ వాదులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
జై….తెలంగాణ…..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే…. జై తెలంగాణ అంటూ తన మీడియా సమావేశాన్ని ముగించారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, కోర్టు ఈ పిటిషన్ విచారణకు తీసుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ హాట్ గా మారాయి.












Leave a Reply