NewsInn

News in a Click

మహిళా సంఘాలకు మరో 3వేల బస్సులు:సీఎం

(హైదరాబాద్,న్యూస్ఇన్)

మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో 3 వేల బస్సులను అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా శక్తి పథకం కింద ఈరోజు ఆర్టీసీకి అప్పగించిన 553 బస్సులకు అదనంగా మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం – మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమంలో బస్సులకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. జిల్లా, మండల, గ్రామ సంఘాలు ఎవరు బస్సులు కొనుగోలు చేసినా ఆర్టీసీకి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. “స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం 67 లక్షల మంది సభ్యులున్నారు. కోటి మందిని సభ్యులుగా చేర్పించండి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది” అంటూ మహిళల సంక్షేమానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా సమగ్రంగా వివరించారు. “మహిళా శక్తికి ఈ ప్రభుత్వంలో చోటుంది. 2034 వరకు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. త్వరలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తా. మహిళా సంఘాలు స్థానికంగా వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి” అని చెప్పారు.

CM wild in shg bus

వ్యవసాయం లాభసాటిగా మారాలి….

రాష్ట్రంలో రైతులు లాభసాటి వ్యవసాయం దిశగా ఆలోచనలు చేయాలి. పంటల మార్పిడి జరగాలి. వడ్లు, మొక్కజొన్నలే కాదు కందులు, మినుములు, పెసళ్ల వంటి పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి రూ. 2,400 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.“పంట మార్పిడిపై రైతులు, రైతు సమాఖ్యలకు అవగాహన కల్పించాలి. మహిళా సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలి. మహిళా సంఘాల్లో చదువుకున్న అవగాహన కలిగిన మహిళలు రైతుల్లో చైతన్యం కల్పించాలి” అని కోరారు.
“ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణంగా సహకరిస్తా. మహిళల పర్యవేక్షణ ఉంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయని చాలా విషయాల్లో నిర్వహణ బాధ్యతను వారికే అప్పగిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నాం. పట్టణాల్లో 1 లక్ష ఇండ్లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ఇండ్లను కూడా మహిళ పేరిటే ఇస్తాం. ఆస్తి ఏదున్నా ఆడబిడ్డల పేరునే ఉండాలి. మంచి మనసుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వరుణ దేవుడు కూడా కరుణించారు” అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.“మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా రూ. 10 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో రాష్ట్రంలోని 27 వేల పాఠశాలల నిర్వహణ బాధ్యత ఆడబిడ్డలకు అప్పగించాం.

పెట్రోల్ బంకులు ఇస్తున్నాం….

Cm Revanth Reddy with Minister Seetakka

మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతనిచ్చాం. పెట్రోల్ బంకులను అప్పగిస్తున్నాం. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా గుర్తించి పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. 8 వేల స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ప్రణాళికలు రచించుకోవడానికి జిల్లా కేంద్రాల్లో మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ స్థాయిలో రాబోతున్నాయి. స్వయం సహాయక సంఘాలకు రూ. 61 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కింద బ్యాంకులకు రూ. 2 వేల కోట్లు చెల్లించాం” అని సీఎం చెప్పారు.
మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా స్వయం సహాయక సమాఖ్య, మండల మహిళా సమాఖ్యలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సులపై అద్దె రూపేణా రూ. 20.34 కోట్ల చెక్కు, ఉచిత ప్రయాణం కింద ఆదా చేసిన రూ. 10,700 కోట్లు, వడ్డీ లేని రుణ పథకం కింద రూ. 500 కోట్ల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *