(హైదరాబాద్, న్యూస్ఇన్)
అవును….మీరు చదివింది నిజమే… బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సొంత కోటికి చేరుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీకి చేరువైన ఆ ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ,చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం. బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని తేల్చి చెప్పి అనర్హత వేటు వేయలేదు. అయితే ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ గతంలో వివిధ రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయ స్థానం నిర్ణయం వైపు బీఆర్ఎస్ ఎదురు చూస్తోంది.
ఎమ్మెల్యే సొంత గూటికి….

ఇదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒక్కరిద్దరు మినహా కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేకపోతున్నారని దాదాపు ఏడాది క్రితం నుంచి ప్రచారం మొదలైంది. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ రాజకీయాలు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణ తెలంగాణాకు చెందిన ఓ ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతకు రాష్ట్ర స్థాయి కార్సోరేషన్ పదవి దక్కడంతో రాజకీయంగా నియోజకవర్గంలో ప్రోటోకాల్ తో ఆ ఎమ్మెల్యేతో సమానంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తన నియోజకవర్గానికి సంబంధించి నిధుల కేటాయింపులో అనుకున్న స్థాయిలో నిధులు సాధించుకోలేకపోతున్నాన్న అభిప్రాయంతో ఆ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ప్రస్తుతం చైర్మన్ పదవి దక్కించున్న నేత వర్గం నుంచి పార్టీలో సమస్యలు తలెత్తుండడం ప్రధాన సమస్యగా ఆ ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఆ మంత్రి కి డిమోషన్ తప్పదా….
దీనికి తోడు ఆ ఎమ్మెల్యే జిల్లాకు చెందిన ఓ మంత్రిని నమ్ముకుని మాత్రమే రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆ మంత్రి కి డిమోషన్ తప్పదన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి పోయిన తరువాత బీఆర్ ఎస్ లోకి వెళ్లక ముందుగానే తాను నమ్ముకున్న నేత పదవిలో ఉన్నప్పుడు సొంత గూటికి చేరుకుంటేనే మంచిదన్న అభిప్రాయంతో ఆ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ పార్టీ కూడా అక్కడ బలమైన నేతను వెతికే పనిలో ఉంది. సొంత గూటికి ఎమ్మెల్యే చేరుకుంటే అధికార పార్టీని మరింత ఇరకాటంలో పెట్టేందుకు పెద్ద అస్త్రం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఎంత వరకు కలిసి వస్తాయో అన్న అనుమానాలు ఆ ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే కారు పార్టీ వైపే వెళితే మంచిదన్న అభిప్రాయాన్ని గత కొన్ని రోజులుగా అత్యంత సన్నిహితుల దగ్గర పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే….ఈ ఒక్క ఎమ్మెల్యేనే సొంత గూటికి చేరుకుంటారా….. ఈ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మరో ఎమ్మెల్యే కూడా గూలాబీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కారెక్కడంతో….. ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గూటికి చేరడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Leave a Reply