NewsInn

News in a Click

ఒక్క రోజులో హైడ్రాకు 54 క‌బ్జాల‌ ఫిర్యాదులు

ఒక్క రోజులో హైడ్రాకు 54 క‌బ్జాల‌ ఫిర్యాదులు

(హైద‌రాబాద్‌, న్యూస్ఇన్‌)

క‌బ్జాల‌తో అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి కాల‌నీవాసులు సేద‌దేరేందుకు అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప‌క్క‌నే వ‌ర‌ద కాలువ ఉన్నా.. కారు పార్కింగ్ పేరిట క‌బ్జాలు చేసి కాల‌నీ వ‌ర‌ద‌కు కార‌ణ‌మౌతున్నార‌ని మ‌రో ఫిర్యాదు. ఉన్న దారిలో 10 అడుగుల మేర కాల‌నీ ర‌హ‌దారుల‌ను క‌బ్జా చేసి రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు పెడుతున్నార‌ని.. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మ‌హేంద్ర‌హిల్స్ వార్డు నంబ‌రు 5లో ఉన్న వ‌ర‌ద కాలువ‌కు కాల‌నీ దారుల‌లోంచి వెళ్లాల్సిన వ‌ర్ష‌పు నీరు వెళ్ల‌కుండా అక్క‌డి వారు ఆటంకాలు సృష్టిస్తున్నార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మ‌హేంద్ర‌హిల్స్‌లో ర‌హ‌దారులు చెరువుల్లా మారుతున్నాయ‌ని పేర్కొన్నారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి మండ‌లం, విలేజ్‌లో చెక్‌పోస్టు ప్రాంతంలో సాయి శ్రీ నిల‌య రెసిడెంట్స్ కాల‌నీ వ‌ర‌ద‌, మురుగు నీటి కాలువ‌ల‌నుంచి బ‌య‌ట ఉన్న ప్ర‌ధాన కాలువ‌కు అనుసంధానం చేయ‌డానికి అభ్యంత‌రాలు చెప్ప‌డంతో నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ చెరువుకు ఆనుకుని ఉన్న కాలువ‌కు కాల‌నీ వ‌ర‌ద‌నీటి కాలువ‌లు అనుసంధానం చేసేలా చూడాల‌ని కోరారు. అలాగే ఇదే కాల‌నీలోని పార్కు స్థ‌లం 400ల గ‌జాల వ‌ర‌కూ క‌బ్జా అయ్యింద‌ని.. వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పార్కును కాపాడాల‌ని అక్క‌డి వారు హైడ్రాకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 54 ఫిర్యాదులంద‌గా.. వీటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా..

రాజేంద్రనగర్, ఉప్పరపల్లి కాలనీలో మధ్యగా వెళ్లే నాలాపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని కాలనీవాసులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. నాలా ప్రవాహానికి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జ‌వ‌హార్‌న‌గ‌ర్ కాప్రా మండలాల మధ్య ప్రభుత్వ భూమి పక్కన ఉన్న లేఔట్‌కు ఆనుకుని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని రక్షించాలని హైడ్రాను కోరారు.

రాజేంద్రనగర్ కాలీమందిర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన పాత నిర్మాణాన్ని తొలగించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని హైడ్రాకు విన్నవించారు.

మల్కాజిగిరి సర్వే నంబర్ 258లో రోడ్డు ఆక్రమణకు గురవుతోందని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. 2017లో స్థానిక ఎమ్మార్వో ఆ స్థలాన్ని రోడ్డుగా గుర్తించి రక్షణ చర్యలు చేపట్టినా, ఇటీవల మళ్లీ రక్షణ గోడ తొలగించి నిర్మాణాలు ప్రారంభించారని పేర్కొన్నారు.

సూరారం ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు మట్టి నింపుతున్నారని రాక్స్ హైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. చింతల చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరింది.

ఉప్పల్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్లు 244, 245లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలతో పాటు చెల్లింపు పార్కింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైడ్రాను కోరారు.

హైద‌రాబాద్ లో ఓ రోడ్డు ట్రంప్ పేరుతో ఉంది తెలుసా……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *