(తిరుమల,న్యూస్ఇన్)
తిరుమల శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా రద్దీ పెరగడంతో టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి సెలవులు మొదలు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వచ్చారు.శనివారం పరిస్థితులను పరిశీలించిన టీటీడీ ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో…ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శనాలను సోమవారం రద్దు చేశారు.

వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్ జామ్…..
వారాంతం సందర్భంగా తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా కనిపించింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు భారీగా చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.









Leave a Reply