(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే బోనాల జాతర రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ రోజు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సురేఖ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఇతర శాఖల అధికారులు జాతర ఏర్పాట్లపై మంత్రి సురేఖ గారికి వివరించగా, మంత్రి సురేఖ వారికి సలహాలు, సూచనలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

బోనాల జాతర సందర్భంగా జూలై 19న ఘటం ఎదుర్కోలు, ఆగస్టు 2న బోనాల ఉత్సవాలు, ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి), గజారోహణ మహోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. జూలై 19 న ఘటోత్సవముల ప్రారంభం నుంచి ఆగష్టు 3న రంగం కార్యక్రమం వరకు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరాంగ తీర్చిదిద్దాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖకు సూచించారు.
దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ అన్ని శాఖలు కలసికట్టుగా పనిచేసి జాతరను దిగ్విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసుశాఖతో పాటు ఇతర శాఖలు బోనాల ఉత్సవ బాధ్యతను విధులుగా పరిగణించకుండా అమ్మవారికి సేవగా భావించి నిర్వర్తించాలని డిసిపి రక్షితా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.









Leave a Reply