(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివరణపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. అత్యాధునిక సంకేతికత అందుబాటులోకి రావడంతో ఏఐ వినియోగించుకోవడంపై కసరత్తును పోలీసు శాఖ మొదలు పెట్టింది.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన టీజీఐసీసీసీలో కీలక సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు 80 క్రిటికల్ స్పాట్స్ ను గుర్తించినట్లు, వీటిలో ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్ఫోర్స్మెంట్ పటిష్టం చేసినట్లు వివరించారు.ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకువచ్చే అవకాశాన్ని పరిశీలించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను సులభంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చన్నారు. ఓఆర్ఆర్ పై నమోదవుతున్న ఉల్లంఘనల్లో దాదాపు 99 శాతం వాహనాలు రీపీటెడ్ వైలేషన్స్ కు పాల్పడుతున్నాయని, అలాంటి వాహనదారుల్లో మార్పు తీసుకువచ్చేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఓఆర్ఆర్ పై వాహనాలు మొరాయించడం (బ్రేక్ డౌన్) వంటి ఘటనలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని, ఇలాంటి వాహనాలను వీలైనంత త్వరగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. రోడ్డుపై వాహనాలు ఆగిపోతే, తక్షణమే 14449 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓఆర్ఆర్ పై ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రధాన్యత నిస్తూ….మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఓఆర్ఆర్ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పారు.












Leave a Reply