(హైదరాబాద్,న్యూస్ఇన్)
విద్యా సంస్థల దగ్గర చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని, మత్తుకు బానిసలైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, విద్యా సంస్థల్లో చేరే ముందే సెల్ప్ డిక్లరేషన్లు తీసుకునే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ లోని ఐసీసీసీ లో స్పందన కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల రక్షణకు అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావించారు. ప్రపంచంలో మహిళలకు, పిల్లలకు రక్షణ కల్పించిన దేశాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. భారత దేశంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత దక్కిందన్నారు. అమెరికా వంటి దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు 150 సంవత్సరాలు పట్టిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో నే బిల్లు పెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికీ కొన్ని విషయాల్లో మహిళలపై వివక్ష కొనసాగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మహిళల భద్రత మా ప్రాధాన్యత…..
మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించడం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామన్నారు.ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి స్పందన పేరుతో 24 గంటల పాటు మహిళలకు అందుబాటులో ఉండేలా టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. స్పందన ద్వారా తక్షణం బాధిత మహిళలకు భద్రత కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న సందేశం ఇవ్వడం కోసం నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను..ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్ద పీఠ వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎంత ఆర్ధిక ప్రగతి సాధించినా భవిష్యత్తు తరం బాగుపడాలంటే పిల్లలు కూడా సరైన దారిలో నడువాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో రాకుండా ఉండేందుకు ఈగల్ టీం ద్వారా డ్రగ్స్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోందన్నారు. ఎంతటి పెద్ద వారున్న ఈ కేసుల్లో వదిలి పెట్టేది లేదని ఇటీవల పట్టబడ్డ ప్రజా ప్రతినిధులతో తమ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందన్నారు.











Leave a Reply