(హైదరాబాద్, న్యూస్ఇన్)
భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో అక్కడి ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని పేర్కొన్నారు. సర్పంచ్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరిస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగితే ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల ప్రజాప్రతినిధులకు పాస్ పంపాలని పోలీసులకు సూచించారు. కొంతమంది తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారని, ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి కలెక్టర్, మంత్రికి పంపాలని తెలిపారు. ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతామని, ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

జూన్ 2లోగా పూర్తి కావాలి …..
నాలుగో నగరంగా ఫ్యూచర్సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నామని, ఆదర్శ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ ద్వారా ప్రపంచానికి విశ్వాసం కలిగిందన్న సీఎం సైబరాబాద్, హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, విమానాశ్రయ నిర్మాణం మన కళ్ల ముందే అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. అభివృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిద్దిన ఆనాటి నాయకులను కొంతమంది అవహేళన చేశారని అన్నారు.

అద్భుతమైన నగరానికి పునాదులు : దేశంలో ఏ నగరానికి లేనివిధంగా 160 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించారని సీఎం గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చే రైతులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. చట్టపరంగా నోటిఫికేషన్లు, న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యిందన్న ఆయన భూమి ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వానికి బదిలీ అవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు బాధితులతో మాట్లాడి అభద్రతా భావాన్ని తొలగించాలన్నారు. అభివృద్ధికి భూములిచ్చిన రైతులను గౌరవించాలని, స్థానికులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుత నగరానికి పునాదులు వేగంగా పడతాయని పునరుద్ఘాటించారు.











Leave a Reply